2007 డిసెంబర్ 27 అర్ధరాత్రి సమయంలో విజయవాడ శివారులో ఉన్న దుర్గాలేడీస్ హాస్టల్ లో బిఫార్మసీ చదువుతున్న అయేషా మీరా అనే 17 సంవత్సరాల యువతిని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. అప్పట్లో ఈ హత్య సంచలనం సృష్టించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని బలవంతంగా తప్పు ఒప్పుకునేలా చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
అయితే, అప్పట్లో కోర్టు నిందితుడు సత్యంబాబుకు 14 ఏళ్ల శిక్ష విధించింది. అయితే, అయేషాను తాను చంపలేదని, తనను బలవంతంగా ఈ కేసులో ఇరికించారని చెప్పడంతో కోర్టు ఈ కేసుకు సంబంధించిన విచారణలో సత్యం బాబు తప్పు చేశాడని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు. 2010 నుంచి జైల్లో ఉన్న సత్యం బాబు 2018 లో రిలీజ్ అయ్యాడు. దాదాపు తొమ్మిదేళ్లు జైల్లో ఉన్నాడు.
నిర్దోషిని ఈ కేసులో ఇరికించినందుకు పోలీసులకు జరిమానా వేసి, దానిని సత్యంబాబుకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సత్యంబాబు ఈ హత్య చేయలేదని తేలిపోయింది. మరి ఎవరు చేసుంటారు. ఈ హత్య వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని అంటున్నారు. ఈ తలకాయలు ఎవరూ. వారిని బయటకు తీసుకొస్తారా లేదంటే కేసును ఇలానే కొనసాగించుకుంటూ పోతారా అన్నది చూడాలి.
కాగా, అయేషా కేసును ప్రస్తుతం సిబిఐ విచారణ చేస్తున్నది. అయితే, ఆరోజు రాత్రి సమయంలో ఆ హాస్టల్ కింద ఫ్లోర్ లో పార్టీ జరిగిందని, పార్టీ తరువాత హాస్టల్ లో ఎవరో కావాలనే ఈ హత్య చేశారని, హాస్టల్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తనకు అనుమానంగా ఉందని అయేషా తల్లి చెప్పిన మాట తెలిసిందే. అయితే, తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని అయేషా తల్లి బేగం చెప్పడంతో ఈ కేసులో పలు అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారణ చేస్తున్నది. మరి దీనిని ఎపి ప్రభుత్వం దిశ యాక్ట్ కింద తీసుకొని విచారిస్తుందా లేదంటే పాత కేసు కాబట్టి పక్కన పెడుతుందా చూద్దాం.