ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చిన సంచలన చట్టానికి మద్దతు పలికిన ప్రముఖురాలు ఆస్పత్రి పాలయింది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి పోరాటానికి శ్రీకారం చుట్టిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఆదివారం స్పృయా కోల్పోయారు. ఆదివారంతో ఆమె దీక్ష 13 వ రోజుకు చేరుకోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమెను వెంటనే లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గత కొద్ది రోజులుగా నమోదైన అత్యాచార సంఘటనలతోపాటు, హైదరాబాద్లో చోటు చేసుకున్న దిశ హత్యాచార ఘటనతో తల్లిడిల్లిన స్వాతి మరోసారి నిరహార దీక్షకు దిగారు. రేపిస్టులకు 6 నెలల లోపు మరణ శిక్ష విధించాలనేది స్వాతి మాలివాల్ డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలనుంచి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడిన నేరస్థులకు మరణశిక్ష విధించాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి కచ్చితమైన హామీ లభించేంతవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం ఆమె చేశారు. అయితే, ఏపీ అసెంబ్లీ ‘ ఏపీ దిశ చట్టం-2019 ‘ ఆమోదించిన నేపథ్యంలో ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలంటూ ఆమె ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. దీక్ష విరమించాలని, లేని పక్షంలో కిడ్నీ ఫెయిల్యూర్ కాగలదని ఆమెను డాక్టర్లు హెచ్చరించారు. అయితే స్వాతి మాలివాల్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఆమెను ఆసుపత్రిలో ఇంట్రా వీనస్ పై ఉంచినట్టు డాక్టర్లు తెలిపారు.
మైనర్లపై అత్యాచార కేసుల్లో నేరస్తులకు మరణ శిక్ష వేయాలని స్వాతి గతంలో చాలా సార్లు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్పై గత ఏడాది ఏప్రిల్లో నిరాహార దీక్షను చేపట్టారు. అయితే 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచార ఘటనల్లో నిందితులకు మరణశిక్ష సహా, కఠిన శిక్షలు అమలు చేసేలా కేంద్రం ఒక ఆర్డినెన్స్ను పాస్ చేయడంతో 10 రోజుల తరువాత ఆమె తన దీక్షను విరమించిన సంగతి తెలిసిందే.