డిసెంబర్ 16 వ తేదీ వస్తుంది అంటే దేశంలో తెలియని భయం వెంటాడుతుంది. ఏడేళ్ల క్రితం అంటే 2012 డిసెంబర్ 16 వ తేదీన రాత్రి తన స్నేహితుడితో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళను ఆరుగురు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. అనంతరం చికిత్స పొందుతూ డిసెంబర్ 27 వ తేదీన మరణించింది. దీంతో దేశం మొత్తం షాక్ అయ్యింది.
దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు జరిగితే దానివలన జరిగే పరిణామాలు ఏంటి అనే దానిగురించి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. నిర్భయ యాక్ట్ ను తీసుకొచ్చినా ఫలితం లేదు. నిందితులను పట్టుకున్నారు. కేసులుపెట్టారు. మరణశిక్ష విధించారు. శిక్ష కన్ఫర్మ్ అయినా ఎప్పుడు ఉరి తీస్తారు అనే విషయం ఇంకా తేలలేదు. దీంతో నిందితులు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. కాలం వెళ్లదీస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటె, ఉరితీసే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వందల సంఖ్యలో తీహార్ జైలుకు అభ్యర్ధనలు వెళ్తున్నాయి. మహిళలు సైతం తీహార్ జైలుకు లేఖలు రాస్తున్నారు. నిందితులను ఉరితీసే అవకాశం ఇవ్వాలని అంటున్నారు. కానీ, ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు జైలు సిబ్బంది. రోజుకు కనీసం ఇలాంటి లేఖలు పదుల సంఖ్యలో వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటె, వర్తిక సింగ్ అనే షూటర్ తన రక్తంతో ఓ లేఖ రాసింది. నిర్భయ నిందితులను ఉరితీసే అవకాశం తనకు కల్పించాలని కోరుతూ తన రక్తంతో లేఖ రాసి కేంద్ర హోమ్ శాఖకు పంపించింది. తనకు మద్దతు ఇవ్వాలని, మహిళలు కూడా ఉరి తీయగలరని చెప్పే అవకాశం కల్పించాలని కోరుతున్నది వర్తిక సింగ్. మరి ఆమె కోరికను ప్రభుత్వం మన్నిస్తుందా ? అవకాశం కల్పిస్తుందా చూద్దాం. ఈ నెలాఖరు లోపు నలుగురు నిందితులను ఉరితీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.