అతి సర్వత్రా వర్జయేత్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ రాజకీయం ఉండటం...వారసులదే పైచేయి కావడం కూడా నొక్కిచెప్పాల్సిన విషయం ఏం కాదు. అయితే, సమన్వయంలో పైచేయి సాధించడం వేరు...అసలు మిగతావారెవరూ లేకుండా తానే సర్వస్వం అనేలా చేయడం వేరు. అలా చేయడం పార్టీని మొత్తం మీరే భ్రష్టుపట్టించారు అనే అపప్రదను ఎదుర్కుంటున్నది మరెవరో కాదు...తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్.
పార్టీ అధినేత చంద్రబాబు కొడుకు కాబట్టి సహజంగానే లోకేష్కు ఉండే ప్రాధాన్యం ఎక్కువే. అయితే, ఆ ఎక్కువ ఆధారంగా ఆయన చేసింది ఎందరో సీనియర్లకు నచ్చలేదు. కొందరు పార్టీ వీడటానికి...ఇంకొందరు లైన్లో ఉండటానికి కారణం అవుతోందని అంటున్నారు టీడీపీ రాజకీయాలను గమనించిన వారు. పార్టీ కోసం నేతలెందరో శ్రమించగా...నేరుగా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకున్న అనంతరం లోకేష్ పార్టీలో చేసిన పెత్తనం చాలా మందికి నచ్చలేదట. దానికి కొనసాగింపుగా...తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కీలక నిర్ణయాలు అన్నీ చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే సాగాయి. దీంతో సహజంగానే నేతలకు తండ్రీ కొడుకులపై మంట పుట్టింది. ఇదే సమయంలో సీనియర్ మంత్రులు - నేతలను కూడా నారా లోకేష్ పెద్దగా పట్టించుకోలేదని, వారి శాఖల్లో తలదూర్చారనే విమర్శలున్నాయి. నాలుగైదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకూ లోకేష్ దగ్గర కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయనే ప్రచారం కూడా ఉంది. ఇటీవలే పార్టీ వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం.
మరోవైపు లోకేషే పార్టీకి సర్వస్వం అనే సిగ్నల్స్ చంద్రబాబు ఇవ్వడం పెద్ద దెబ్బ అంటున్నారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని వాళ్ళ చేతిలో పార్టీ నిలబడుతుందా? అంటూ వంశీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇందుకు ఉదాహరణ. అయితే, సర్దుకుపోవచ్చు కదా అనే సందేహం సహజంగానే తెరమీదకు వస్తుంది. కానీ ఒకటి కాదు అనేక అంశాల్లో లోకేష్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారని టాక్ ఉంది. లోకేష్ వచ్చాక సీనియర్లకు గౌరవం తగ్గిందట. ఓ కోటరీ ఏర్పాటు చేసుకున్న లోకేష్ వారికే ప్రాధాన్యం ఇవ్వడం, కోటరీతో వసూళ్లు చేయించడం వంటివి కూడా..చేశారట. ఇక యువనేతగా సమకాలికులను ప్రోత్సహించాల్సింది పోయి...తనకన్నా ఎవరైనా పార్టీలో యువనేతలు ముందుకు వెళుతున్నా.. వారి ప్రసంగాలు బాగున్నా తట్టుకోలేకపోవడం.. కాస్త ఓవర్ టేక్ చేయకు అన్నా అనేవారట. దీంతో హర్టయిపోయిన ముఖ్యనేతలు, సీనియర్లు, యువనేతలు పార్టీకి రాంరాం చెప్తూ...లోకేష్పై దుమ్మెత్తిపోసి తమ దారి తాము చూసుకున్నారట.