పదిహేనేళ్ల తరువాత 2019లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి రాజధానికి వెళ్తున్నప్పుడు.. కట్టపై వెళ్తూ ఉన్నానని.. రాజస్థాన్ ఎడారిలో పోతున్న ఫీలింగ్ వచ్చిందని స్పీకర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు.
శాసన సభాపతి తప్పులు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బాధ్యత కలిగిన స్పీకర్ చేసిన వ్యాఖ్యల్లా కనిపించడం లేదని విమర్శించారు. న్యాయమూర్తి స్థానంలో కూర్చుని ఒకరికి అనుకూలంగా మాట్లాడడం తగదని వర్ల రామయ్య హితవు పలికారు. ఎడారిలో కూర్చుని బెల్ కొడుతున్నారా అని నిలదీశారు. గౌరవ స్పీకర్కి దృష్టి లోపం ఉందేమోనంటూ సెటైర్లు వేశారు. దృష్టి లోపాన్ని సరిచేసుకోవాలని ఎద్దేవా చేశారు. కళ్లజోడు పెట్టుకుని రాజధానిని విజిట్ చేయాలని ఆయన సూచించారు.
అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బుగ్గన చేసిన ఆరోపణలపై వర్ల ఘాటుగా స్పందించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ముద్రించిన ఎంపెరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 190 ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారని.. ఇప్పుడేమో 38 ఎకరాలు అంటున్నారని విమర్శించారు.
అలాగే ధూళిపాళ్ల నరేంద్రకు 13 ఎకరాలు ఉందని చెప్పారని.. ఆయన రాజధాని ప్రకటన వెలువడిన తరువాత కేవలం మూడున్నర ఎకరాలు కొనుగోలు చేశారని చెప్పారు. మంత్రి బుగ్గన అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించారని తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంటుందో.. వైఎస్ జగన్ పాలన అలాగే ఉందని తీవ్ర విమర్శలు చేశారు.
జీఎన్ రావు కమిటీ నివేదికను ఆయన ఆక్షేపించారు. జీఎన్ రావు నేతృత్వంలో కమిటీ వేయడమే తప్పని వర్ల అన్నారు. జీఎన్ రావుపై ఆరోపణలున్నాయని.. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పటి నుంచీ జీఎన్ రావు సంగతి తెలుసన్న వర్ల.. రాజధానిపై కమిటీ చేసిన సిఫార్సులను తోసిపుచ్చారు.