ఎన్ని చట్టాలు తెచ్చిన ఎన్ని శిక్షలు అమలు చేసిన మహిళలపై జరిగే అరాచకాలు అంత ఇంత కాదు తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో బాలికకు మత్తు మందిచ్చి ఖాశింవలి అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లికి ఆరోగ్యం బాగోలేదని నమ్మబలికి వేరే ఊరులో ఉన్న ఆ బాలికను రప్పించి.. మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై శుక్రవారం రాత్రి 10 గంటలకు బాలిక తల్లి, బంధువులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులోని వివరాల మేరకు... కొలనుకొండ గ్రామంలో నివాసం ఉండే ఖాశిం వలి, అతని భార్య రసూల్బీ స్థానికంగా వడ్డీ వ్యాపారస్థులు. పూసలు అమ్ముకుని బాధిత బాలిక తల్లి, వారి కుటుంబసభ్యులు జీవనం సాగిస్తున్నారు. ఖాశిం వలి ఈ ఏడాది రంజాన్ మాసంలో తన ఇంటికి బాధిత బాలికను తీసుకెళ్లి.. కూల్డ్రింక్లో మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విషయం బయటపడటంతో మత పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. అనంతరం బాలికను వేరే ప్రాంతంలోని మదరసాకు తరలించారు. ఈ నెల 22న మదరసా వద్దకు ఖాశిం వలి వెళ్లి ఆ బాలికకు తన తల్లికి ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఈ విషయాన్ని బాలిక మదరసా పెద్దలకు చెప్పడంతో వారు నమ్మలేదు. దీంతో బాలిక గోడ దూకి వచ్చి ఖాశిం వలితో కొలనుకొండ వచ్చింది. బాలిక బంధువులు తిరునాళ్ల కోసం ఊరు వెళ్లడంతో.. తమ ఇంటికి తీసుకెళ్లి మరోసారి ఖాశిం వలి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణానికి అతని భార్య కూడా సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక వారి నుంచి తప్పించుకుని విజయవాడకు వెళ్ళగా,ఈ ఘటన స్వచ్ఛంద సంస్థకు చెందినవారు ఆమె నుంచి వివరాలు సేకరించటంతో వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు బాలిక బంధువులు, తల్లికి సమాచారం అందించడంతో వారు శుక్రవారం రాత్రి 10 గంటలకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఖాశింవలిని అదుపులోకి తీసుకున్నారు.