నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై బీజేపీలో ఇంకా అయోమయ వైఖరి కొనసాగుతోంది. ఇప్పటికే...రాజధానిపై ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయమని, ఇందులో కేంద్రం పాత్ర లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. నాయకులు ఎవరు మాట్లాడిన అది వారి సొంత నిర్ణయమని కూడా ఆయన ప్రకటించారు. అయితే, ఇంకా నేతలు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి లేదని అన్నారు.
జగన్మోహన్న్రెడ్డి అధికారాంలోకి వచ్చాక తనకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే యోచన చేస్తూ అక్కడ భూములిచ్చిన రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సొంత కమిటీలను వేసుకుని రాజకీయ
పార్టీలను సంప్రదించకుండా తన ఇష్టం వచ్చినట్లు నివేదికలు ఇప్పించుకుంటున్నారని అరోపించారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు
విషయంలో రాష్ట ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని అందువల్ల వాటికి కూడా
సంబంధం ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
నూతన రాజధానిగా అమరావతి ఏర్పాటుకు తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ పార్టీలు అమోదించాయని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రధాన వాటాదారుగా కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఖర్చు చేసిందని, 33,000 ఎకరాలు అమరావతి రాజధానికి ఇచ్చి మరొక ప్రధాన వాటాదారులుగా రైతులు తమవంతు కృషి చేశారని చెప్పారు. అలానే రాష్ట ప్రభుత్వం కూడా రూ.5500 కోట్లు ప్రజాధనాన్ని వివిధ నిర్మాణాలకు ఖర్చు చేసిందన్నారు. బాండ్ల రూపంలో 2,000 కోట్లు పెట్టుబడిగా పెట్టి పెట్టుఐడీదారులు అమరావతిలో భాగస్వామ్యం అయ్యారని, ఇటుకలు పేరుతో వివిధ స్వచ్చంద సంస్థల ద్వారా అమరావతి నిర్మాణానికి కోట్లాది రూపాయలు విరాళాలు సమకూర్చారని కన్న అన్నారు. 180 కేంద్ర సంస్థల కార్యాలయాల ఏర్పాట్లు కోసం అమరావతిలో భూమీ సేకరించడం జరిగిందని, ఈ విధంగా పలువురు వాటాదారుల ఇప్పటికే రాజధాని అంశంలో భాగస్వామ్యం ఉందని కన్నా చెప్పారు. కాని రాజధానితో భాగస్వామ్యం ఉన్న సంస్థలను సంప్రదించకుండా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని కన్నా అన్నారు.
ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో వాటాదారులు, భాగస్వాముల అభిప్రాయాలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కన్న అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అంతేకాని పాలన వికేంద్రీకరణకు కాదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న అపరిపక్వ, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. అమరావతి సీడ్ క్యాపిటల్ లోనే పూర్తి శాసన-పరిపాలన-కార్యనిర్వాహక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ అర్థికరాజధానిగా ఎదగడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, సినిమా, ఫుడ్ ప్రాసెస్సింగ్, యంత్ర, నౌక, ట్రేడ్ రంగాలకు కావాల్సిన ప్రత్యేక అర్థిక మండళ్లు, ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణా కేంద్రాలను నిర్మించడం ద్వారా అభివ్భద్ది వికేంద్రీకరణ చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.