విశాఖపట్నం రాజధానిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికే ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టు డే జై కొట్టింది. తన లేటెస్ట్ ఎడిషన్లో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులపై ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. ఏపి రాజధానిగా విశాఖపట్నమే సరైన నగరంగా సంచికలో సీనియర్ పాత్రికేయుడు అమరనాధ్ కే మీనన్ స్పష్టంగా చెప్పారు. విశాఖ రాజధానిగా జగన్ నిర్ణయం ఏ విధంగా సరైనదో కూడా మీనన్ తన కథనంలో ఉదాహరణలతో సహా వివరించటం గమనార్హం.
మీనన్ చెప్పిన కారణాల ప్రకారం దేశంలోని ప్రముఖ నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. కేంద్రప్రభుత్వ సంస్ధలతో పాటు ప్రభుత్వ రంగ సంస్ధలు, ప్రైవేటు రంగంలోని ప్రముఖ సంస్ధలు కూడా ఉన్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాలకు చెందిన ప్రజలు విశాఖలో ఉన్నారు. మొత్తం మీద ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన జనాలు సుమారు 7 లక్షల మంది ఉన్నారట.
హిందుస్ధాన్ పెట్రోలియం కార్పొరేషన్, షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్, ఈస్ట్రన్ నావల్ కమాండ్, ఐటి, ఫార్మా ఇండస్ట్రీలు ఇక్కడ ఉండటం నగరానికి చాలా కలిసి వస్తుందని చెప్పారు. అలాగే ఒకవైపు సముద్రం మరోవైపు కొండల వల్ల నగరానికి వాస్తు కూడా బాగా కలిసి వస్తుందని వాస్తు పండితులు చెప్పినట్లు మీనన్ చెప్పారు.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సుల వల్ల పెద్దగా ఉపయోగం కనబడలేదట. ఎందుకంటే విశాఖలో సదస్సులు పెట్టిన చంద్రబాబు పెట్టుబడులను అమరావతిలో పెట్టమని చెప్పారట. అదే విశాఖలోనే పెట్టుబడులు పెట్టమని చెప్పుంటే పరిస్ధితి మరో రకంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఏపి రాజధానిగా చంద్రబాబు విశాఖను ప్రకటించుంటే దేశంలోనే ప్రముఖ నగరాలతో పోటి పడే స్ధాయికి చేరుకునేదని ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ నరేష్ కుమార్ చెప్పినట్లు మీనన్ చెప్పారు. నేషనల్ హై వే 16కి ఆనుకునే సుమారు 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటం కూడా విశాఖపట్నంకు బాగా కలిసి వస్తుందని మీనన్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి జగన్ నిర్ణయాన్ని జాతి మీడియా వ్యతరేకిస్తుంటే జాతీయ మీడియా మాత్రం స్వాగతిస్తోంది.