కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఓ డైలాగ్ ఉంది.. ‘ఒక్కడికి కోపం వస్తే చాలు..’ అని. పవన్ కూడా ‘నాకు కోపం వచ్చింది’ అంటాడు. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ పై ఇదే తరహాలో ఓ వ్యక్తికి కోపం వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కు ఫిర్యాదు చేయగా పోస్టల్ డిపార్ట్ మెంట్ కు లక్ష రూపాయల ఫైన్ వేసింది. డిస్ట్రిక్ ఫోరమ్ కన్సూమర్ లీగల్ ఎయిడ్ అకౌంట్లో ఈ రూ.లక్ష డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
సదరు వ్యక్తికి రిజస్టర్డ్ పోస్ట్ లో వచ్చిన కాల్ లెటర్ ఆలస్యమై తనకు ఉద్యోగం వచ్చే పరీక్షను అటెంప్ట్ చేయలేక పోయాడు. ఈ కాల్ లెటర్ ను 2018 ఏప్రిల్ 6వ తేదీనే పంపారు. ఈ లెటర్ 14వ తేదీన కస్టమర్కు చేరాల్సి ఉంది. పోస్ట్ ఆలస్యం కావడంతో తన కస్టమర్కు ఈ రిజిస్టర్డ్ పోస్ట్ను 23వ తేదీన డెలివరీ చేసింది. అంటే.. రిజిస్టర్డ్ పోస్ట్ కూడా 17 రోజుల ఆలస్యంగా చేరింది. దీంతో కోపమొచ్చిన కస్టమర్ పోస్టాఫీస్పై డిస్ట్రిక్ ఫోరమ్లో ఫిర్యాదు చేశాడు. పోస్టల్ డిపార్ట్మెంట్ వల్ల తనకు నష్టం కలిగిందంటూ వారి అలసత్వం వల్ల జాబ్ పొందలేక పోయానని ఫిర్యాదు చేశాడు.
స్పందించిన డిస్ట్రిక్ ఫోరమ్ ఫిర్యాదును స్వీకరించి విచారణ జరిపింది. దీంతో పోస్టల్ డిపార్ట్మెంట్కు రూ.లక్ష జరిమానా విధించింది. నెల రోజుల్లోగా ఈ పరిహారాన్ని కస్టమర్కు అందించాలని ఆదేశించింది. అయితే.. పోస్టల్ డిపార్ట్మెంట్ మాత్రం డిస్ట్రిక్ ఫోరమ్ తీర్పును సవాలు చేస్తూ స్టేట్ కమిషన్ను ఆశ్రయించింది. స్టేట్ కమిషన్ కూడా పోస్టల్ డిపార్ట్ మెంట్ కు షాకిస్తూ డిస్ట్రిక్ ఫోరమ్ తీర్పును శిరసా వహించాలని పేర్కొంది. సేవలను, బాధ్యతలను, జవాబుదారీతనాన్ని మెరుగుపరుచుకోవాలని పోస్టల్ డిపార్ట్మెంట్కు అక్షింతలు వేసింది.