రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం కరెక్టే అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దెబ్బ పడటం ఖాయమనే అనిపిస్తోంది. తొందరలో భర్తీ చేయాల్సిన రాజ్యసభ స్ధానాల్లో మెగాస్టార్ కు ఒకటి కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారట. వైసిపి తరపున రాజ్యసభ తీసుకోవటానికి వీలుగా చిరంజీవి తొందరలో వైసిపిలో చేరబోతున్నట్లు సమాచారం. వచ్చే మార్చి-ఏప్రిల్ నెలల్లో ఏపి ఖాతాలోని నాలుగు రాజ్యసభ స్ధానాలు ఖాళీ అవుతున్నాయి.
ఎంఎల్ఏల దామాషా ప్రకారం మొత్తం నాలుగు రాజ్యసభ స్ధానాలూ వైసిపికే దక్కుతాయనటంలో సందేహం అవసరం లేదు. ఎన్నికలంటూ జరిగితే ఒక్కో రాజ్యసభ స్ధానానికి మామూలుగా అయితే 35 ఓట్లు కావాలి. వైసిపికి ఉన్న 151 ఎంఎల్ఏల బలం వల్ల అన్నీ స్ధానాలూ వైసిపికే దక్కుతాయి. సో నాలుగు స్ధానాలను సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా నాలుగు సామాజికవర్గాలకు కేటాయించాలని జగన్ నిర్ణయించారట.
సామాజికవర్గాల సమతూకంలో భాగంగానే ఒకటి చిరంజీవి కేటాయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కాపు కోటాలో చిరంజీవికి రాజ్యసభ స్ధానం కేటాయించటం వల్ల జగన్ కు వచ్చే అదనపు అడ్వాంటేజ్ ఏమీ లేకపోయినా పవన్ ను దెబ్బకొట్టే ఏకైక వ్యూహంతోనే జగన్ పావులు కదుపుతున్నారట. జగన్ తన మనసులోని మాటను చెప్పినపుడు చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. వీళ్ళిద్దరికీ సన్నిహితంగా ఉండే ఓ మంత్రి ద్వారా వ్యవహారం నడుస్తోందట.
సదరు మంత్రి కారణంగానే జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు చిరంజీవి బహిరంగంగా మద్దతు తెలిపారని అంటున్నారు. ఒకవైపు తమ్ముడు పవన్ జగన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అన్నయ్య చిరంజీవి మాత్రం బలంగా జగన్ కు మద్దతు తెలుపుతున్న కారణం ఇదే అనే ప్రచారం జరుగుతోంది. అలాగే విశాఖపట్నంకు సమీపంలోని భీమిలీలో చిరంజీవికి 300 ఎకరాలున్నాయట.
ఇక రాజకీయంగా చూసినా మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలో మెజారిటి ఓట్లు వైసిసికే పడ్డాయి. అయితే ప్రతిసారి పడతాయని చెప్పేందుకు లేదు. అలాగని చిరంజీవి జగన్ కు మద్దతుగా ఉన్నంత మాత్రాన కాపుల ఓట్లన్నీ వైసిపికి పడేదీ అనుమానమే. కాకపోతే ఓ ప్రముఖ వ్యక్తి వైసిపికి మద్దతుగా నిలుస్తున్నాడని చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తుందంతే.