అమరావతి తరలింపు విషయంలో జరుగుతున్న ఆందోళనలపై ఉదయం నుంచి ఓ సంచలన వార్త చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని కావాలి అంటూ ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రైతుల ఆవేదనకు ఇది నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రచారం ఫేక్ అని తేలింది. ఈ మేరకు గుంటూరు ఐజీ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ ప్రచారంపై సైతం వైసీపీ మండిపడింది.
``తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జరిగినట్లు గా కొంతమంది ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా ద్వారా కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను వైరల్ చేస్తూ ప్రశాంత వాతావరణం ఉన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారు. ఇటువంటి అసత్యమైన వార్తలను ప్రసారం చేసిన, ఇతరులకు షేర్ చేసిన, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వార్తలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాము.ఇట్లు, ఐజీ, గుంటూరు`` అని ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు అధికార వైసీపీ సైతం ఈ ప్రచారంపై మండిపడింది. ``నీచాతి నీచంగా మారిన నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియోను ఎడిటింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశానికి ముడిపెట్టి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం. అమరావతి రాజధాని కావాలి అంటూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ వీడియోను... సోషల్ మీడియాలో ఎల్లో గ్యాంగ్ విపరీతంగా ట్రోల్ చేస్తోంది. ఇటువంటి అసత్య వార్తలను, ప్రజలను రెచ్చగొట్టే వార్తలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది.` అని పేర్కొంది.