ప్రముఖ సినీనటుడు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పృథ్వీ ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయి కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వైసీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అటాక్ అయిన నేపథ్యంలో ఈ విషయం మీద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తక్షణం విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో విజిలెన్స్ పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్వీబీసీ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పృధ్వీ వ్యవహారశైలి తదితర విషయాలపై ఆరా తీశారు.
కాగా, తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అధికార ప్రకటన వెలువడింది. `ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విరాజ్ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసారమాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు చేశారు. దీనిపై ఎస్వీబీసీ చైర్మన్ స్పందిస్తూ తనపై బురద చల్లేందుకు ఎవరో పనిగట్టుకొని తన స్వరాన్ని అనుకరించి ఆడియో రూపొందించారని టిటిడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి నివేదించారు. ఈ విషయమై టిటిడి చైర్మన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆడియోలోని వాయిస్ శాంపిల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తిస్థాయిలో విచారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా...ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేయగా వారు స్పందిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్ను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆదేశించారు.`` తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
కాగా, ఉద్యోగినితో మాట్లాడిన పృథ్వీ కాల్ రికార్డ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ``నువ్వంటే ఇష్టం.., నువ్వు నా గుండెల్లో ఉన్నావ్.. ఐ లవ్యూ అని ఉద్యోగినితో అన్నారు. ప్రస్తుతం తాను మద్యం మానేసానని..ఒక వేళ తాగితే నీతో కూర్చొని తాగుతా. మీ రూమ్ కు వచ్చి వెనకనుంచి గట్టిగా వాటేసుకుందామనుకున్నా కానీ భయపడి ఎక్కడ అరుస్తావోనని వాటేసుకోలేదన్నారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకిష్టమో తెలీదని ఐలవ్యూ` అని ఆ ఆడియోలో ఉంది.