హైదరాబాద్లో ఓ రేవ్ పార్టీ ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని సీక్రెట్ ఎఫైర్ పబ్లో పెద్ద సంఖ్యలో యువతులతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆదివారం సాయంత్రం పబ్పై దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు సిద్ధంగా 22 మంది యువతులను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే, ఈ నగ్న నృత్యాల దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జూబ్లీహిల్స్లోని సీక్రెట్ ఎఫైర్ పబ్లో కొంతమంది యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు టాప్ పబ్పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 23మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, రేవ్ పార్టీ ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పోలీసులు వివరాలు ఆరా తీయగా, పబ్ను బుక్ చేసుకుంది ఓ ఫార్మా కంపెనీగా పోలీసులు గుర్తించారు. సేల్స్ను పెంచుకునేందుకే ఆ పార్మా కంపెనీ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. డాక్టర్లు, సేల్స్ ఉద్యోగుల కోసం ప్రతి ఏటా ఇలాంటి రేవ్ పార్టీని ప్రసాద్ అనే ఈవెంట్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేసి నిర్వాహకుడు ప్రసాద్పై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. పబ్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, పట్టుబడ్డ యువతులంతా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించారు. సినిమా అవకాశాలు, ఈవెంట్ డాన్సుల కోసం హైదరాబాద్కు వచ్చిన యువతులను వ్యభిచార రొంపిలోకి దించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన జర్నలిస్టులపై సదరు యువతులు దాడికి తెగబడ్డారు. కొందరి సెల్ఫోన్లు లాక్కుని కింద పడవేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది.