మనుషుల్లో రోజురోజుకు మానవత్వం తగ్గుతోంది. ఒక కసాయి కొడుకు కన్నతల్లినే దారుణంగా హత్య చేసి చంపేశాడు. జన్మనిచ్చి... నవమాసాలు మోసి... పెంచి... పెద్ద చేసిన తల్లి భారం అవుతోందని భావించిన కొడుకు తన తల్లి పాలిట కాలయముడయ్యాడు. మంచంపై లేవలేని స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటబాక మండలం తోటపల్లి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
 
తోటపల్లి గ్రామానికి చెందిన ముత్తమ్మ(70), ముక్కయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ముత్తమ్మ, ఆమె భర్త చిన్న కుమారుడు నాగులుతో కలిసి ఉంటున్నారు. గడచిన సంవత్సరం నుండి ముత్తమ్మకు కళ్లు సరిగ్గా కనపడకపోవటంతో పాటు, నడవలేని స్థితిలో ఉండటంతో మంచానికే పరిమితమయ్యారు. ముత్తమ్మ చివరకు తన సొంత పనులు కూడా చేసుకోలేని స్థితికి వచ్చారు. 
 
ముత్తమ్మ భర్త ముక్కయ్యే ఆమెకు సేవలు చేసేవాడు. వయస్సు పైబడటంతో ముత్తమ్మ తరచుగా అనారోగ్యనికి గురవుతూ ఉండేది. నాగులు గత కొంతకాలంగా చికిత్సకు ఎక్కువగా ఖర్చవుతోందని తన తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు. నిన్న తండ్రి ముక్కయ్య బయటకు వెళ్లిన సమయంలో కత్తితో తల్లి గొంతు కోసి నాగులు కన్నతల్లిని హతమార్చాడు. స్థానికులు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడి నాగులును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తల్లి బాగోగులు చూసేవారు ఎవరూ లేనందున తానే కన్నతల్లిని హత్య చేసి చంపేసినట్లు అంగీకరించాడు. ఇరుగుపొరుగువారు తల్లితండ్రిని నాగులు ఫించన్ డబ్బుల కోసం కూడా వేధించేవాడని చెబుతున్నారు. మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను నాగులు కొట్టేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి భద్రాచలం ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన నిందితుడు నాగులును కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: