ప్రముఖ బ్యాంకు ఎండి, సీఈవోగా పనిచేసిన చందా కొచ్చర్ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. ఐసిఐసిఐ బ్యాంకు ఎండి, సీఈవోగా ఉన్నంత కాలం కార్పొరేట్ ప్రపంచం, మీడియా కొచ్చర్ ను ఓ అంటూ ఆకాశానికెత్తాశాయి. అత్యంత శక్తిమంతమైన మహిళని, ప్రభావ వంతమైన మహిళ అంటూ బ్రహ్మండంగా నెత్తిన పెట్టుకున్నాయి. తీరా ఇపుడేమో సిబిఐ, ఈడి కేసుల్లో కోర్టులు, జైళ్ళ చుట్టూ తిరుగుతోంది.
విచిత్రమేమిటంటే అత్యంత ఉన్నతస్ధాయిలో ఉన్నపుడు చేసిన మోసాలకు గాను ఆమె ఆస్తులను యటాచ్ చేయటమే కాకుండా అప్పట్లో ఆమెకు బ్యాంకు చెల్లించిన బోనస్ తదితరాలను కూడా రికవరీ చేయాలంటూ తాజాగా బ్యాంకు పాలకవర్గం కోర్టును ఆశ్రయించటం విచిత్రంగా ఉంది. నిజానికి కొచ్చర్ తన పదవిని దుర్వినియోగం చేసి లేని అధికారాలను చేతుల్లోకి తీసుకుని వీడియోకాన్ కు దాదాపు రూ. 3500 కోట్ల రుణాలు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు.
అంత భారీ మొత్తంలో వీడియోకాన్ కు బ్యాంకు ఎందుకు రుణమిచ్చిందంటే ఆమె భర్త కంపెనీలో కీలక స్ధానంలో ఉన్నారు కాబట్టే. కేవలం భర్తను చూసే ఆమె బ్యాంకు నుండి వేలకోట్ల రూపాయల రుణం ఇచ్చారన్న విషయం కూడా అందరికీ తెలుసు. మొదట్లో ఆమెపై ఆర్దికపరమైన ఆరోపణలు వచ్చినపుడు బ్యాంకు పాలకవర్గం మొత్తం ఆమెకే మద్దతుగా నిలబడింది.
అయితే పెరుగుతున్న ఆరోపణలను తట్టుకోలేక చివరకు దర్యాప్తు చేయటానికి శ్రీకృష్ణ కమిటిని నియమించింది. మొత్తం విషయాన్నంతా లోతుగా దర్యాప్తు, విచారణ చేసిన కమిటి జరిగిన మోసాన్ని బయటపెట్టింది. వెంటనే బ్యాంకు పాలకవర్గం కొచ్చర్ నే బాధ్యురాలిగా చేసి బ్యాంకు నుండి బయటకు పంపేసింది. అప్పటి నుండి కొచ్చర్ కు కష్టాలు మొదలయ్యాయి.
చివరకు ఆమెపై దర్యాప్తు సంస్ధలు కేసులు నమోదు చేయటం, అరెస్టు చేయటం, రిమాండ్ కు పంపటం, ఆస్తులు జప్తు చేయటం, చివరకు బోనస్ గా ఇచ్చిన మొత్తాన్ని కూడా రికవరీ చేయాలనుకోవటం అంతా ఆమె ఖర్మ కాకపోతే మరేమిటి ?