జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో పర్యటించారు. కాకినాడ జనసేన కార్యకర్తలపై కొన్ని రోజుల క్రితం దాడి చేశారు. ఈ దాడిలో ఆ పార్టీ కార్యకర్తలు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడకు చేరుకున్నారు. కాకినాడలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు.
అయితే, పవన్ వస్తుండటంతో పరిస్థితులు అదుపు తప్పకూడదు అని చెప్పి 144 సెక్షన్, సెక్షన్ 30 ని అమలు చేశారు. పవన్ రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్నది. కార్యకర్తలు రోడ్డుమీదకు రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ లాఠీ ఛార్జ్ లో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కార్యకర్తలపై దాడి చేసి, ఇష్టం వచ్చినట్టుగా తిట్టి ఇప్పుడు మీరే కేసులు పెడతారా అని ప్రశ్నించారు.
పోలీసులు కూడా అధికార పక్షం వారికే సపోర్ట్ చేస్తున్నారని, దాడులు చేయడం మంచి పద్దతి కాదని అన్నారు. మరోసారి ఇలాంటి సీన్ రిపీటైతే ఊరుకోబోమని హెచ్చరించారు. భారీకేట్లు పెట్టినా దాటుకొని వస్తామని, కవాతు నిర్వహిస్తామని అన్నారు. అమరావతి రగడ జరుగుతున్న సమయం నుంచి ఒక్కసారిగా అన్ని మారిపోయాయి. అమరావతిలో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
కార్యనిర్వాహక రాజధానిని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే వీటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో లాంగ్ మార్చ్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. అయితే, ఇది ఎప్పుడు ఉంటుంది అన్నది తెలియాల్సి ఉన్నది. ఈనెల 16 వ తేదీన ఉదయం 11 గంటలకు బీజేపీ నాయకులతో పవన్ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం అనంతరం పవన్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది.