అమరావతి కోసం మరోమారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశం విడిచి పారిపోవాల్సి మేలు అనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించిన సుజన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజా స్వామ్య స్ఫూర్తితో 13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తాజాగా ఎంపీ సుజనాచౌదరి ఏపీ సీఎం జగన్కు 10 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. నిధులు లేవనే సాకు చూపి రాజధాని మార్చటమనేది సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సుజనాచౌదరి సూచించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనను అమలు చేయాలంటే ప్రభుత్వానికి రూ.4లక్షల కోట్లు అవసరమని ఆయన విశ్లేషించారు.
జధానిగా అమరావతి ఎంపిక, భూ సమీకరణ, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అక్కడ జరిగిన అభివృద్ధి, పూర్తిచేసిన నిర్మాణాలు, పనుల పురోగతి తదితర అంశాలతో పాటు రాజధాని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, దానివల్ల కలిగే నష్టాలు అని పలు అంశాలను ప్రస్తావిస్తూ..ఏపీ సీఎం జగన్కు ఎంపీ సుజనా చౌదరి 10 పేజీల లేఖ రాశారు. మాస్టర్ప్లాన్ రూపకల్పన, డిజైన్ల తయారీ, అమరావతి అభివృద్ధి వంటి అంశాలను లేఖలో ఆయన ప్రస్తావించారు. ఇప్పటికిప్పుడు రాజధాని మార్చటం అంటే న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన అవస్థల్ని కొనితెచ్చుకోవడమేనని సుజనా హెచ్చరించారు. ప్రస్తుతం రాజధానిని విశాఖ, కర్నూలుకు మార్చాలంటే రూ.లక్ష కోట్లు అవసరమని.. ఆ వ్యయం భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు సుజనా చౌదరి.
రాజధాని భూసమీకరణలో అక్రమాలు జరిగాయని భావిస్తే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంతో రైతులు, పెట్టుబడిదార్లు ఒప్పందం కుదుర్చుకున్నందున వాటిని నెరవేర్చకపోతే వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అమరావతి మార్పు అంశంపై రైతుల ఆందోళనల నేపథ్యంలో రాజధాని మార్చవద్దని సీఎంకు సుజనా సూచించారు.