నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బదులుగా ప్రతిపాదిత మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ సారి సంక్రాంతి కూడా జరుపుకోకుండా...మందడంలో రైతుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. దీంతోపాటుగా తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరం వద్దకు చంద్రబాబు, నారా-నందమూరి కుటుంబ సభ్యులు చేరుకొని అక్కడ దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకే తమ కుటుంబం ఈ రోజు మందడానికి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. తాను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పబోనని, ఈ ఏడాది కష్టాల సంక్రాంతి జరుపుకుంటున్నామని అన్నారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండని వైసీపీకి సవాల్ విసిరారు. అయితే, చంద్రబాబు సవాలు ఆయనకే బెడిసి కొట్టింది.
ఏపీ ప్రభుత్వం ఎన్నికలకి వెళ్లి అలా ఎన్నికల్లో గెలిచాకే ఈ తరహా నిర్ణయాలు తీసుకోండని బాబు సూచించారు. ఎన్నికలు నిర్వహిస్తే...ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని సైతం ప్రకటించారు చంద్రబాబు. ఒకవేళ ఎన్నికలు పెట్టడం ఇష్టం లేకుంటే రాజధాని తరలింపుపై రెఫరెండం పెట్టమని డిమాండ్ చేశారు. అయితే, బాబు ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అదే బాబు తనతో సహా పార్టీ ప్రజా ప్రతినిధులందరితో రాజీనామా చేయించి...ఎన్నికలకు వెళ్లడం గురించి.
తెలంగాణ ఉద్యమం కోసం...గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా అనేక దఫాలుగా ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లింది. ఇక ఏపీ విషయానికి వస్తే ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ సారథ్యంలోని ఎంపీలు రాజీనామా చేశారు. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు అమరావతి కోసం గలం విప్పుతున్న చంద్రబాబు అందుకోసం రాజీనామా చేయవచ్చు కదా? అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే, దీనికి స్పందనలు సైతం అదే రీతిలో వస్తున్నాయి. `బాబు గారు ట్రై చేయండి. మీరు నిజంగా అమరావతి కోరుకుంటే వెంటనే రాజీనామాలు చేయాలి` అని ఓ నెటిజన్ స్పందించారు. ` వీలైతే జోలెలో డబ్బులెయ్యండి ఇలాంటివి అడగొడ్డు ప్లీజ్` అంటూ ఓ నెటిజన్ వెక్కిరించాడు. `వాళ్ళు తెలంగాణ సాధించే వరకు పోరాడారు, మరీ మనం ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడవలసిన అవసరం లేదా ఆ దమ్ము లేదా ఎవరికి` అంటూ ఓ నెటిజన్ నిలదీశాడు. `అందుకే అయ్యా ఇప్పుడు ysrcp 22 మంది mpలను రాజీనామా చేసి ప్రత్యేక హోదా తెచ్చేయనండి` అంటూ మరో నెటిజన్ వైసీపీకి పంచ్ వేశాడు.