బీజేపీ-జ‌న‌సేన పొత్తుపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో సుమారు 3 గంటలపాటు బీజేపీ ముఖ్య‌నేత‌లు కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చలు జరిపారు. అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి . దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తమతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల సంయుక్త నిర్ణయాలతో ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరుతో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

 

 
``రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్టితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీలు రాజకీయంగా కలసి ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించడం జరిగింది. అనేక జాతీయ, రాష్ట్ర విషయాలపై కూలంకుషంగా చర్చించిన తరవాత రెండు పార్టీలు కలసి ఒక అవగాహనకు వ‌చ్చాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి అందిస్తున్న సమర్థ‌వంతమైన, అవినీతిరహిత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగల ధృడమైన పాలనను జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్ స్వాగతించారు. `` అని తెలిపారు.


నవ్యాంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్రంలొ నెలకొన్న లోపభూయిష్ట విధానాలను ఈ రెండు పార్టీలూ ఖండించాయని ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న తెలిపింది. `2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏ విశ్వాసంతో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఇప్పటి ఈ ఆందోళనకర పరిస్థితికి అప్పటి ప్రభుత్వం కారణమైంది. అవినీతిలో కూరుకుపోయి, కుటుంబ నేపథ్యానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇచ్చారు. మార్పును ఆకాంక్షించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు 2019 సంవత్సరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధికార పగ్గాలు అందివ్వడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ప్రస్తుత ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకే పరిపాలనను పరిమితం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. సుపరిపాలన కోసం ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కనుక ఏ పార్టీ అధికారానికి వచ్చినా ప్రభుత్వ విధానాలు కొనసాగించాల్సిన బాధ్యత వర్తమాన ప్రభుత్వంపై ఉంటుంది. ప్ర‌స్తుత వైసీపీ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ అనేక ప్రజాకంటక నిర్ణయాలు చేస్తున్న సందర్భంలో పెట్టుబడులు రాక, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి రాష్ట్ర ప్రగతి కుంటుపడిన విషయాన్ని ఇరు పార్టీలు గుర్తించాయి.అని ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు

 

గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం, వర్తమాన వైసీపీ ప్రభుత్వం కులం, కుటుంబ రాజకీయాలకు, పరస్పర దూషణలకు పరిమితం అవుతూ స్వలాభాపేక్షతో అవినీతిలోకూరుకుపోయి రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచాయి. నవ్యాంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ ఇచ్చే దిశగా జాతీయ దృక్పథం నిండిన ఈ కూటమి పని చేయాలని నిశ్చయించింది. విలువలతో కూడిన నాయకత్వాన్ని అందిస్తూ మరియు యువతకు పెద్ద పిట వేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, పిపిఏల విషయాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దయెత్తున అందిన ప్రోత్సాహకాల గురించి లోతుగా చర్చించుకోవడం జరిగింది. ఈ విషయాలపైనా కూలంకుషంగా చర్చించి ఒక అవగాహనతో భవిష్యత్ కార్యాచరణపై కూటమి ఒక నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యలపై లోతుగా అవగాహన చేసుకొని వాటి పరిష్కారం కోసం ఇరు పార్టీలూ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. పరస్పర సమన్వయంతో ప్రజా సంక్షేమానికి, నవ్యాంధ్ర ప్రగతికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజల మన్ననలను  చూరగొని 2024 సంవత్సరానికి అధికారంలోని రాగలమనే ధీమాను వ్యక్తపరచడం జరిగింది.`` అని పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మినారాయణ సంత‌కాల‌తో కూడిన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: