రెండు పార్టీల నేతల ఉమ్మడి మీడియా సమావేశం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరుగుతోంది. ఎందుకంటే మీడియా సమావేశం సందర్భంగా బిజెపి నేతలు సునీల్ దియోధర్, జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడుతో ఎట్టి పరిస్ధితుల్లోను పొత్తులనేది ఉండదు గాక ఉండదు అంటూ కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేశారు.
జనసేనతోనే తమ పొత్తుంటుంది అని ప్రకటించిన జీవిఎల్ మాట్లాడుతూ తమతో పొత్తు పెట్టుకోవాలని కొంతమంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు పేరు చెప్పకనే చెప్పారు. అటువంటి వాళ్ళని తాము దగ్గరకు కూడా రానీయమని ప్రకటించారు. అవసరానికి తమను వాడేసుకుని తర్వాత తీసి పడేసిన రోజులు అయిపోయాయని వాళ్ళు గుర్తుంచుకోవాలని వార్నింగ్ కూడా ఇవ్వటం గమనార్హం.
బిజెపి, జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని ఢిల్లీలో డిసైడ్ అయిన తర్వాత విజయవాడలోని ఓ హోటల్లో గురువారం సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన సమావేశంలో వన్ టు వన్ ఏం మాట్లాడింది బయటకు పొక్కలేదు లేండి. కానీ తర్వాత జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో మాత్రం చంద్రబాబుపైన తమకున్న వ్యతిరేకతను కమలనాధులు బాహాటంగానే బయటపెట్టేశారు.
మరి ఇదే నిజమైతే నిన్నటి వరకూ చంద్రబాబు మనిషిగా పనిచేసిన పవన్ ఒక్కసారిగా వదిలేసి బిజెపితో పొత్తు పెట్టుకోవటంలో ఏమిటర్ధం ? అసలే చంద్రబాబు ఇపుడు కష్టకాలంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల ప్రతిపాదన పేరుతో జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు చంద్రబాబు ఇల్లిల్లు జోలె పట్టుకుని తిరుగుతున్నారు.
అప్పటికీ చంద్రబాబు కష్టాన్ని పవన్ కొంత వరకూ పంచుకున్నారు. అయితే అది సరిపోలేదు. జగన్ పై ఒత్తిడి తేవటంలో ఇటు చంద్రబాబు అటు పవన్ ఇద్దరూ ఫెయిలయ్యారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాని పవన్ ఒక్కసారిగా బిజెపి చంకనెక్కి కూర్చున్నారు. దాంతో చంద్రబాబు మరీ ఒంటరివాడైపోయినట్లున్నారు. పార్టీ నేతలు సహకరించక, జనాలు పట్టించుకోక, నమ్ముకున్న పవన్ కూడా హ్యాండ్ ఇచ్చేస్తే చంద్రబాబు ఏమైపోవాలి ?