తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నంతకాలం కూడా ఆ పార్టీ హంగులు ఆర్భాటాలతో కాలాన్ని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఐదేళ్ళపాటు నీళ్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఒక విధంగా చెప్పాలి అంటే బాబు ఓడిపోవడానికి హైటెక్ పాలన ఒకటి కారణమైతే, రెండోది నీళ్లు అని చెప్పాలి. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చుట్టూ హంగామా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా హైటెక్ గా ఉండాలని కోరుకుంటారు.
అందుకే హైటెక్ గా చూపించేందుకు ఆసక్తి చూపుతుంటాడు. ఒకప్పుడు ఇది పనిచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను డెవలప్ చేసిన ఘనత చంద్రబాబుదే అది కాదనలేం. కానీ, దానిని పట్టుకొని ఇంకా అలానే ఉండాలని అంటే కష్టం కదా. ఇప్పుడు అక్కడ అధికారంలో తెరాస పార్టీ ఉన్నది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేసిన సమయంలో కూడా బాబుగారు అలానే చేశారు. ముఖ్యంగా అమరావతి విషయంలో.
అభివృద్ధి చెందిన ప్రాంతంలో బాబుగారు రాజధానిని ఏర్పాటు చేసి ఉంటె మరోలా ఉండేది. కానీ, ఖాళీ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలి అనుకోవడం బాబు చేసిన మొదటి తప్పు. అలానే అమరావతి ప్లానింగ్ పేరుతో బాబు చాలా కాలం పాటు సమయం వృధా చేశారు. డబ్బులు ఖర్చు చేశారు. సింగపూర్, అమెరికా, లండన్ అంటూ ప్లానింగ్ తీసుకొచ్చి వాటికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చివరికి కొంత మాత్రమే ఖర్చు చేసి తాత్కాలిక భవనాలు నిర్మించారు.
ఇదే బాబుకు చేటు చేసింది. వైకాపా నేతలు బాబును ఇందుకే తిడుతున్నారు. హంగు ఆర్భాటాలు తప్పించి మరొకటి చేయలేదని, అమరావతి పేరుతో కోట్లాది రూపాయల ధనం వృధా చేశారని వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నది. ఈ హంగు ఆర్భాటాలతో సమయం మొత్తం వృధా కావడమే కాకుండా అభివృద్ధి కుంటుపడనుందని, అప్పులు కుప్పలు కుప్పలుగా మిగిల్చారని వైకాపా నేతలు అంటున్నారు. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.