ఈనెల 20వ తేదీన జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, అమరావతి జేఏసీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి, ఛలో అసెంబ్లీ, జైల్ భరో కార్యక్రమం అన్ని వర్గాల్లో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మద్దతిచ్చే పక్షాలు ఈ ఆందోళనలకు సిద్ధమవుతుండగా అధికార పార్టీ వాటిని గమనిస్తోంది. అయితే, ఈ విషయంలో తాజాగా పోలీసుల నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఎస్.సి.జడ్ & గుంటూరు రేంజ్ ఐ జి వినిత్ బ్రిజ్ లాల్ ఈ మేరకు హెచ్చరికతో కూడిన ప్రకటన విడుదల చేశారు.
``తేదీ 20-01-20 వ తేదిన వివిధ రాజకీయ పార్టీలు , అమరావతి jac చేపట్టిన అసెంబ్లీ ముట్టడి , ఛలో అసెంబ్లీ , జైల్ భరో కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవు. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 crpc నిషేధాజ్ఞలు విదించడమైనది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నందున, ఇట్టి కార్యక్రమాల వలన అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలగడమే కాకుండా, సచివాలయ, హైకోర్టు ఉద్యోగుల విధులకు మరియు స్థానికులు, సామాన్య ప్రజల జీవనానికి అంతరాయం కలుగుతుంది. కావున ఎలాంటి అనుమతి లేని పైన పేర్కొన్న కార్యక్రమాలలో ప్రజలు పాల్గొనరాదు అని పోలీస్ వారు తెలియపరచడమైనది.`` అని స్పష్టం చేశారు.
``రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలలోని ప్రజలు కొత్త వారిని ఎవరిని తమతమ నివాస ప్రాంతాలలో ఉండుటకు అనుమతించ రాదని, అట్టి వారిని అనుమతించడం వల్ల వారు అక్కడ హింసను ప్రేరేపించడం ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంది. కావున అలాంటి వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిన వారి మీద కూడా చట్టబద్దమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ముట్టడి కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కాని సహకరించిన వారిపైన మరియు వాహనాలు, ఇతర లాజిస్టిక్స్ సమకూర్చే వారిపైన తగిన చట్టబద్దమైన చర్యలు తీసుకోబడతాయని తెలపడమైనది. ప్రజలందరు శాంతిభద్రతల పరిరక్షణకై సహకరించ వలసినదిగా పోలీసుల వారి విజ్ఞప్తి.`` అని స్పష్టం చేశారు.