తెలంగాణలో జరుగుతోన్న మునిసిపల్ ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు యుద్ధానికి ముందే చేతులు ఎత్తేశారు. కీలక నేతలు చేతులు ఎత్తేయడంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేస్తున్న అభ్యర్దులు అనాథులుగా మారారు. తెలంగాణలోని పెద్ద జిల్లాల్లో ఒకటి అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అచ్చంపేట, జడ్చర్ల మినహిస్తే 17 మున్సిపాల్టిలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటి చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించే నాయకులు ఎవరు లేకపోవడంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు బాధలు వర్ణనాతీతంగా మారాయి.
పాత మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సైతం కాంగ్రెస్కు పేరున్న నాయకులు ఉన్నా కూడా వీళ్లు మునిసిపల్ ఎన్నికలను పట్టించుకోవడం లేదు. రేవంత్రెడ్డి తాను ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న మునిసిపాల్టీల్లో ప్రచారం చేస్తుండడంతో ఇక్కడ పట్టించుకోవడం లేదు. సీనియర్ నేతలు చిన్నా రెడ్డి, సంపత్, నాగం జనార్దన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి లాంటి నాయకులు నియోజకవర్గాలకు పరిమితం అయ్యారు.
ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ సైతం టీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరిగినా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపాలిటి మహబూబ్ నగర్. అటువంటి మున్సిపాల్టిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎవరు తీసుకోకపోవడంతో అభ్యర్థులు ప్రచారం నిర్వహించడంలో స్పీడ్ తగ్గింది.
ఏదేమైనా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థులు తల్లిదండ్రులు లేని పిల్లలుగా మారిపోయారు. ఇక కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన ఈ పరాక్రమ వంతులు అంతా ఇప్పుడు యుద్ధానికి ముందు చేతులు ఎత్తేసిన పరిస్థితి నెలకొంది. పార్టీ బలంగా ఉన్న చోటే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగిలిన చోట్ల ఇంకెంత ఘోరంగా ఉంటుందో ? అర్తం చేసుకోవచ్చు. మరి ఈ దారుణ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ఎప్పటకి బయట పడుతుందో ? చూడాలి.