’తమతో కలవకుండా బిజెపి-జనసేన విడిగా పోటిచేస్తే రాజకీయంగా తమకు నష్టమని తెలుగుదేశం నేతలకు భయం పట్టుకుంది. ఆ కారణంగానే రాజధాని అంశాన్ని టిడిపి తెరమీదకు తెచ్చింది’ ... ఇది చెత్తపలుకులో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ అంగీకరించిన నిజం. మాయాబజార్ సినిమాలో ధర్మపీఠం అనేదొకటుంది. దానిమీద నిలబడితే ఎలాంటి వాళ్ళైనా మనసులోని మాటను బయటపెట్టేయాల్సిందే. అదే పద్దతిలో ఇపుడు చంద్రబాబు చేస్తున్న గోలంతా దేనికోసమో రాధాకృష్ణ బయటపెట్టేశారు.
ప్రతి ఆదివారం ఆర్కె రాసే చెత్తపలుకు కూడా చంద్రబాబునాయుడు విషయంలో ఒక్కోసారి ధర్మపీఠం లాగనే పనిచేస్తుంది. తాజాగా రాసిన కథనంలో కూడా చంద్రబాబు అమరావతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం వెనకున్న నిజాన్ని అనుకోకుండానే బయటపెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను చంద్రబాబు ఎంత రాజకీయం చేస్తున్నారో అందరూ చూస్తున్నదే.
నిజానికి చంద్రబాబు చేస్తున్న గోలంతా తమ భూములను కాపాడుకోవటం, ధరలు పడిపోకుండా చూసుకోవటం, తమ బినామీల జోలికి రాకుండా రక్షించుకోవటమే ధ్యేయంగా జరుగుతోంది. ఈ విషయాలు అన్నీ అందరికీ తెలిసిందే. కానీ అమరావతి సెంటిమెంటు అంటూ కతలు చెప్పి రాష్ట్రంలోని జనాలను రెచ్చ గొట్టటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లో రైతులు భూములిచ్చినా ఇపుడు ఆందోళన జరుగుతున్నది మాత్రం కేవలం ఓ ఐదారు గ్రామాల్లో మాత్రమే అని అందరికీ తెలిసిందే. ఇపుడు అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనంతా కేవలం చంద్రబాబు మద్దతు మీడియాలో మాత్రమే. ఒకవైపు అమరావతి విషయంలో టెన్షన్ పడుతుంటే ఇంకోవైపు పవన్ వెళ్ళి బిజెపితో పొత్తు పెట్టుకోవటమే చంద్రబాబుకు అసలైన షాక్.
క్షేత్రస్ధాయిలో పరిణామాలు చూస్తుంటే రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసిపి ఒకవైపు బిజెపి+జనసేన, టిడిపి, కాంగ్రెస్, వామపక్షాలు ఇంకోవైపు పోటి చేయటం ఖాయం. నిజానికి బిజెపి+జనసేనలు కలిసి టిడిపి విడిగా పోటి చేస్తే మూడు పార్టీలకూ ఇబ్బందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్లే ఫలితాలు వైసిపికి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చేస్తుందని రాధాకృష్ణలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే ఎలాగైనా మళ్ళీ మూడు పార్టీలను కలపాలని తీవ్రంగా రాధాకృష్ణ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిపోతోంది. చూద్దాం ఏ జరుగుతుందో.