ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాడి వేడిగా సాగుతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఇక ఈ విషయంపై చర్చను ఆరంభించిన బుగ్గన..ఈ బిల్లు ప్రవేశ పెట్టేందుకు దారి తీసిన పరిస్థితులను సభకు వివరించారు. బ్రిటీష్ కాలం నుంచి వచ్చిన పరిస్థితులను వివరించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. చంద్రబాబు హయాంలోని ఇన్ సైడర్ ట్రేడింగ్ గురించి సుదీర్ఘంగా వివరించారు.
అమరావతిలో బాబోరి భూదందాను ఆధారాలు, సాక్ష్యాలతో సహా వివరించారు. అక్కడ బాబోరి భూదందా బట్టబయలు చేశారు. ముందుగా చంద్రబాబుతోనే ఈ దందా చిట్టాను ప్రారంభించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.25 ఎకరాలు కొన్నారని చెప్పారు. ఓ వైపు శివరామకృష్ణన్ కమిటీ రాజధానిలో పర్యటిస్తుండగానే బాబు భూములు కొన్నారని తెలిపారు. అది కూడా సర్వే నెంబర్లతో సహా బుగ్గన చెప్పారు.
కేవలం చంద్రబాబు గురించి మాత్రమే కాకుండా.. ఆ పార్టీ నేతల భూబాగోతాలు బయటపెట్టారు. రాజధానిని నిర్ణయించక ముందే.. రాజధాని గ్రామాల్లో భూములను కొన్న వైనాన్ని వివరించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్తో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత , ఆమె కుమారుడు శ్రీరాం, అల్లుడు వడ్లమూడి శ్రీ హర్ష పేరిట కూడా ఎక్కడెక్కడ భూములు కొన్నారో చెప్పారు.
మాజీ మంత్రి నారాయణతో పాటు.. టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు 40ఎకరాల వరకూ కొన్ని విషయాలను, చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని కూడా రాజధాని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొన్నారని మంత్రి బుగ్గన తెలిపారు. వీరితో పాటు పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి, మురళీ మోహన్.. ఇలా టీడీపీ నేతలు భూ కొనుగోళ్ల గురించి వివరించారు.