`` ఏపీ సీఎం జగన్ అత్యవసర కేబినెట్ భేటీ....రేపు మండలి రద్దు బిల్లును శాసనసభలో పెట్టే అవకాశం`` అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. మంగళవారం రాత్రి 10 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం జరగనుందని, మంత్రులు అందరూ అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. శాసనమండలి రద్దే అజెండాగా కేబినెట్ భేటీ జరగనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ రేపు లేఖ ఇవ్వనుందని, న్యాయపరమైన అంశాలను వైసీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
శాసనమండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీల ఉండగా.. టీడీపీ నుంచి 34 మంది, వైసీపీ నుంచి 09, పీడీఎఫ్ నుంచి 06, స్వతంత్రులు ముగ్గురు, బీజేపీ ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒక్కరు ఉన్నారు. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అధికార పక్షానికి మండలిలో మెజార్టీ లేకపోవడంతో... ఎలాగైనా బిల్లును అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. మండలిలోని ప్రతి ఒక్క సభ్యునికి బిల్లుపై మాట్లాడే అవకాశమివ్వాలనడం కూడా టీడీపీ ఎత్తుగడలో భాగమే. ప్రతి సభ్యునికీ అవకాశం ఇవ్వాలనే టీడీపీ డిమాండ్ వెనుక కారణం...చర్చను పూర్తి స్థాయిలో జరపడం ద్వారా జాప్యం చేయాలనే ఎత్తుగడ. ఇలా మండలి ఇరకాటంగా మారిన తరుణంలో...కౌన్సిల్ను రద్దు చేసేందుకు జగన్ కదులుతున్నట్లు సమాచారం.
అయితే, అసలు శాసనమండలి రద్దు అనేది అసలు సాధ్యమా అనే చర్చ జరుగుతోంది. ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దు చేయడం జగన్కు సులభమని అంటున్నారు. ఈ మేరకు కేంద్రానికి ఉన్న పలు వెసులుబాట్లపై కూడా చర్చ జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించి పంపించాక దాన్ని తోసిపుచ్చడం కేంద్ర ప్రభుత్వానికి కూడా కష్టం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ముఖ్యమంత్రి జగన్ తలుచుకుంటే...మండలికి ఫుల్ స్టాప్ పెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఇక మండలికి ఏమీ కాదు, జగన్ ఏమీ చేయలేడు అని యనమల, లోకేష్ మాట్లాడటం వెనుక కారణం. టీడీపీ నుంచి ఎవరూ జగన్ వైపు వెళ్లకుండా దువ్వే ప్రయత్నం అంటూ విశ్లేషిస్తున్నారు.