తెలంగాణాలో జరిగిన పురపాలక ఎన్నిక ఫలితాలను శనివారం ఉదయం పది గంటల కల్లా ప్రకటించనున్నారు. ఆ దిశగా పుర ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. రెండు లేదా మూడు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ విధంగా ‘పుర’ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటలకల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. తక్కువ ఓట్లు పోలైన వార్డుల ఫలితాలు గంట, గంటన్నరలో వెల్లడయ్యే అవకాశముంది.

రెండు దశల్లో..
పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. మొదటిది ప్రాథమిక దశగా, రెండోది ఫలితం నిర్దేశించే దశ (గుర్తుల వారీగా ఓట్ల లెక్కింపు)గా నిర్దేశించారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు ఉదయం ఆరు గంటలకే లెక్కింపు కేంద్రానికి చేరుకొంటారు. అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరుస్తారు. పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన బ్యాలెట్‌ పెట్టెను సంబంధిత టేబుల్‌ వద్దకు తీసుకొస్తారు. ఓట్ల లెక్కింపునకు ప్రతి టేబుల్‌ వద్ద ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు సహాయకులు ఉంటారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు లెక్కిస్తారు.

అనుమానాస్పద ఓట్లపై ఆఖర్లో నిర్ణయం
ప్రతి టేబుల్‌పై ఆయా  వార్డులో పోటీచేసిన అభ్యర్థులకు ఒక్కో ట్రేను ఉంచుతారు. నోటాకు ఒకటి , అనుమానంగా ఉన్న ఓట్లకు మరోటి ఉంచుతారు. ఓట్ల కట్టలు విప్పి అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఆయా అభ్యర్థికి సంబంధించిన ట్రేలో వేస్తారు. నోటాకు వచ్చిన ఓట్లను నోటా ట్రేలో, సిరా సరిగా అంటని, రెండువైపులా అంటి, అనుమానంగా కనిపించే ఓట్లను మరో ట్రేలో వేస్తారు. అనుమానస్పదంగా ఉన్న ఓట్లపై ఆఖర్లో రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం తీసుకొంటారు. అభ్యర్థులను లేదా ఏజెంట్లను పిలిచి వారి సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి వాటిపై నిర్ణయం తీసుకొంటారు. తర్వాతే అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను ప్రకటిస్తారు.

మధ్యలో ఉంటే స్కేలుతో కొలిచి నిర్ణయం
బ్యాలెట్‌ పత్రంపై ఓటర్లు వేసిన స్వస్తిక్‌ ముద్ర ఇద్దరు అభ్యర్థుల పేర్ల మధ్యలో ఉంటే, అధికారులు స్కేలుతో కొలిచి నిర్ణయం తీసుకుంటారు. ఇద్దరు అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి పేరుకు సమీపంలో స్వస్తిక్‌ ముద్ర ఉందో చూసి ఓటును ఆ అభ్యర్థి ఖాతాలో వేస్తారు.అభ్యర్థి పేరుపై స్వస్తిక్‌ ముద్ర వేయకుండా టిక్‌ చేసినా సరే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు.  ఇద్దరు అభ్యర్థుల పేర్లపై టిక్‌ చేస్తే తిరస్కరిస్తారు. ఒకవేళ ఎవరైనా ఓటర్లు అత్యుత్సాహంతో బ్యాలెట్‌ పత్రంపై ఎక్కడైనా తమ ఓటరు సీరియల్‌ నంబరు రాసిన పక్షంలో వాటిని తిరస్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు.

కేంద్రాల సంఖ్య ఆధారంగా ఏజెంట్ల నియామకం
 పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా వార్డు పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ఆధారంగా కౌంటింగ్‌ ఏజెంట్ల నియమానికి ఎన్నికల అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఒక వార్డులో నాలుగు పోలింగ్‌ కేంద్రాలుంటే ముగ్గురు ఏజెంట్ల నియామకానికి అనుమతిస్తారు. ఇందులో ఓట్ల లెక్కింపు టేబుళ్ల వద్ద ఇద్దరు, ఆర్వో టేబుల్‌ వద్ద్ద పరిశీలన నిమిత్తం మరో ఏజెంటును నియమించుకునే వెసులు బాటు కల్పించారు.

రీ కౌంటింగ్‌ చేయాలంటే
వార్డు పరిధిలోని ఓట్ల లెక్కింపు పూర్తికాగానే కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకొన్న పిదప రెండు నిమిషాల వ్యవధిలోనే రిటర్నింగ్‌ అధికారి ఆయా వార్డు ఫలితాన్ని వెల్లడిస్తారు. ఫలితంపై పోటీచేసిన అభ్యర్థులకు ఎవరికైనా అభ్యంతరాలుంటే నిర్ణీత పదిహేను నిమిషాలలోపు రాతపూర్వకంగా అభ్యంతరాన్ని తెలియజేస్తూ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు సమర్పిస్తేనే రీ కౌంటింగ్‌కు అవకాశం ఉంటుంది. రీ కౌంటింగ్‌పై తుది నిర్ణయం మాత్రం రిటర్నింగ్‌ అధికారిదేనని ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సమాన ఓట్లు వస్తే
ఏదేని వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో విజేతను ప్రకటించనున్నారు. ఇందుకు గాను రెండు బాక్సుల్లో ఒక్కో అభ్యర్థి పేరు మీద ఐదు చీటీలు రాసి వేస్తారు. ఇలా పది చీటీలను మరో డబ్బాలో వేసిన కలిపిన తదనంతరం లాటరీ తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: