రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్లకు జరుగుతున్న కౌంటింగులో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతున్నది. ఇప్పటి వరకూ కౌంటింగు సరళిని చూస్తే కారు జోరు దూసుకుపోతున్నది. ప్రతిపక్షాలకు ముచ్చేమటలు పట్టే విధంగా టీఆర్ఎస్ అభ్యర్థులు హవా కొనసాగిస్తున్నారు. మున్సిపల్ , కార్పొరేషన్లల్లోనూ టీఆర్ఎస్ ఇదే జోరు కొనసాగుతున్నది. టీఆర్ఎస్ ఇప్పటికే 30 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, 3 కార్పొరేషన్లల్లో స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ రెండోస్థానానికి సరిపెట్టుకోనున్నది. బీజేపీ పూర్తిగా చతికిల పడిందని చెప్పవచ్చు. ముందుగా ఊహించిన విధంగా కార్పొరేషన్లల్లో బీజేపీకి మెరుగైన సీట్లు వస్తున్నాయని భావించినా దరిదాపుల్లో కూడా లేదని తేలింది. బీజేపీ ప్రచారానికి తగ్గట్టు పట్టణ ఓటర్లు నమ్మడం లేదని తేలింది. 370 ఆర్టికల్ రద్దు, అయోద్య వివాదం పరిష్కారం, త్రిపుల్ తలాక్, ఎన్సీఆర్, ఎన్పీఆర్ వంటి అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లినప్పటికీ ప్రజలు విశ్వసించలేదు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలు చూస్తే బీజేపీ హైదరాబాద్ శివారులో మహేశ్వరం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. హైదరాబాద్ శివార్లో మెరుగైన ఫలితాలొస్తాయని బిజెపి భావించినప్పటికీ దానికంటే కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. మీర్పేట్ పెద్దంబర్పేట్లలో బిజెపి అభ్యర్ధులు చతికిలపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ పట్టణ ఓటర్లు టిఆర్ఎస్ కే పట్టం గట్టారు.
ఇక మిగతా వాటిలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. కార్పొరేషన్లల్లో కూడా పెద్దగా ప్రభావం లేదు. కార్పొరేషన్లల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని కొన్ని సర్వేలు వెల్లడించినప్పటికీ ఫలితాలు తలక్రిందులైనట్లు తెలుస్తున్నది. సీఎం కే చంద్రశేఖరరావు నాయకత్వాన్ని పట్టణ ప్రజలు కూడా విశ్వసించినట్లు కౌంటింగు సరళిని బట్టి తెలుస్తున్నది. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ రోజు కౌంటింగు జరుగుతున్నది.
బీజేపీ పార్టీ స్థానిక సమస్యలను పక్కను పెట్టి జాతీయ అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లడం బీజేపీ పాలిట శాపంగా మారింది. దీంతో ఫలితాలు తారుమారైనట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ చాలా స్తానాల్లో పోటాపోటీగా ఉన్నప్పటికీ కేసీఆర్ పథకాలపై ప్రజలకు మోజు తీరలేదని ఫలితాలను బట్టి తేలింది.