ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రస్తావించిన...తన మానస పుత్రిక అయిన ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ఇంకో రూపంలో తెరమీదకు తెచ్చారు. ఈ దఫా గతంలో వలే రాష్ట్రాల టూర్లు, ముఖ్యమంత్రుల సమావేశం వంటివి కాకుండా ఈ దఫా ఇంకో అంశంతో తన హస్తిన ఫోకస్ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఇరకాటంలో పెడుతున్న అంశంపైనే టార్గెట్ చేసేందుకు గులాబీ దళపతి డిసైడయ్యారు.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చల్లారడం లేదు. సీఏఏకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలు తీర్మానాలు చేస్తున్నాయి.గతంలో సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు తీర్మానాలు చూశాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే.. సీఏఏ అమలు విషయంలో కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లగా… సీఏఏపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ... తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఏఏ బిల్లు అనేది తప్పుడు నిర్ణయమని ఆయన అన్నారు. బిల్లులో ముస్లింలను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని కేసీఆర్ అన్నారు. సీఏఏపై ఇప్పటికే చాలా మంది సీఎంలతో మాట్లాడినట్లు కేసీఆర్ తెలిపారు. త్వరలోనే దేశంలోని సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు హైదరాబాద్ వేదికగా కార్యాచరణ ఉంటుందని ఆయన చెప్పారు. భారత్ను హిందుమత దేశంగా మార్చేందుకు బీజేపీ చేస్తోందని సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 16మంది సీఎంలు-మాజీ సీఎంలు సీఏఏకు అనుకూలంగా లేరని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏను విరమించుకోవాలని కోరారు. సీఏఏకుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో పాటుగా కేబినెట్లోను చర్చ చేస్తామని కేసీఆర్ తెలిపారు.