సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణది విచిత్రమైన పరిస్థితి. బాలయ్య మాటల్లో తడబాటు, కంగారు ఉన్నా.. ఆయన అనుకున్న విషయం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. ఏ విషయంలో అయినా బాలయ్య ముక్కుసూటిగా ఉంటాడని.. ఏదేనా తేడా వస్తే వాళ్ల విషయంలో కఠినంగానే ఉంటాడన్న పేరు కూడా ఉంది.
అయితే ఇదంతా చంద్రబాబు దగ్గర మాత్రం బాలయ్యకు చెల్లుబాటు కాదన్నది పచ్చి నిజం. అసలు బాబుబ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచాక చాలా మంది బాలయ్య రివేంజ్ తీర్చుకుంటాడని.. బాబుకు తగిన బుద్ధి చెపుతాడనే అనుకున్నారు. ఎన్టీఆర్ సైతం చాలాసార్లు తన నట, రాజకీయ వారసుడు బాలయ్య అన్న విషయం చెప్పారు. అప్పట్లోనే చంద్రబాబుకు గుబులు రేగింది. ఇక బాలయ్య నోరు మెదపకుండా బ్రాహ్మణిని కోడలిని చేసేసుకున్నాడు. అప్పటి నుంచే బాలయ్య బాబు చేతిలో బందీ అయిపోయాడు.
ఇక ఇప్పుడు బాలయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సరే బావ బాబును కనుసైగలకు జడవాల్సిందే అన్నట్టుగా ఉంటున్నాడు. తాజాగా బాబు తీసుకున్న స్టాండ్ బలపరిచేలా మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడిన బాలయ్యకు తన సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాబును కాదని ఎదురు చెప్పలేడు.. మాట్లాడలేడు.. అంత ధైర్యం లేదు.. ఇక ఇలాంటి అవమానాలు తప్పదు అన్నట్టుగా బాలయ్య ప్రవర్తన ఉందన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది.
గురువారం బాలయ్య తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ వారు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టును అడ్డుకుంటున్న బాలయ్య.. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ గోబ్యాక్ అంటూ నినదించారు.
చివరకు టీడీపీ వాళ్లు, ఆ పార్టీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు బాలయ్యకు అడ్డుగా ఉండి ఆయన్ను అక్కడ నుంచి తప్పించారు. ఏదేమైనా బాలయ్యకు బావ అంటే ఉన్న భయంతో ఈ అవమానాలే బెటరా ? అన్నట్టుగా ఆయన తీరు ఉందని.. అందుకే ఏపీలో ఇన్ని రాజకీయ పరిణామాలు జరుగుతున్నా ఆయన నోరు విప్పలేకపోతున్నారన్న చర్చలే నడుస్తున్నాయి.