ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరిటాల సునీతా రవీంద్ర కుమారుడు సిద్ధార్థ-మామిళ్లపల్లి తేజస్విని వివాహ నిశ్చితార్థ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినతే నారా చంద్రబాబు ఫ్యామిలీ కూడా హాజరైంది. హైదరాబాద్ గండిపేట ప్రాంతంలోని రిధిరా రిట్రీట్ రిసార్ట్లో శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఏపీ మాజీ మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమ, ఎమ్మెల్యే వంశీ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు రమణ హాజరయ్యారు.
వీరితో పాటు నటుడు మోహన్బాబు, మంచు లక్ష్మి, బీజేపీ నాయకుడు వీరేందర్గౌడ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పరిటాల సిద్ధార్థ, తేజస్విని వివాహ నిశ్చితార్థ వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. కాగా, ఏపీలో వైసీపీ భారీ విజయం తరువాత టీడీపీలో కొంత నైరాశ్యం నెలకొంది. ఇంత ఘోరంగా పార్టీ ఓటమి పాలవుతుందని ఊహించలేకపోయిన టీడీపీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత పరిటాల సునీత బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం వారి విషయంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పగించారు చంద్రబాబు. అయినప్పటికీ పరిటాల ఫ్యామిలీ పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు మాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది.
పరిటాల రవి ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో దశాబ్దాల పాటు పార్టీని నమ్ముకున్న తమ కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వాలని పరిటాల సునీత కోరగా.. చంద్రబాబు మాత్రం ఒక్క సీటు మాత్రమే కేటాయించారు. దీంతో సునీత తప్పుకుని కుమారుడు శ్రీరామ్ను పోటీ చేయిస్తే.. అతడు ఓటమిపాలయ్యాడు. ఇక అప్పటి నుంచీ వీళ్లు పార్టీ మారుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత బీజేపీ ఏపీపై ఫోకస్ చేసిందని... ఈ క్రమంలోనే పరిటాల కుటుంబంతో చర్చలు జరిపిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.