ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత అర్ధరాత్రి (31 -01 -2020 ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ఏపీ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో.. పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ఏపీ అధికార ప్రభుత్వం ప్రారంభించినట్టు తెలుస్తుంది.
దీంతో ఆదేశించిన ఉత్తర్వులలో భాగంగా రాజధాని లో కొంత భాగాన్ని కర్నూలు కి తరలించింది. కర్నూలుకు తరలించే ప్రభుత్వ కార్యాలయాల్లో.. పాక్షిక న్యాయ విభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయాలు అన్ని ఇప్పటి వరకు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పని చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు పేర్కొంది. ఈ విభాగాలు అన్నింటికి అవసరమైన భవనాలను ఏర్పాటు చేయాలని., ఆర్ అండ్ బీ ఇన్ చీఫ్, కర్నూలు కలెక్టర్ కు ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది.
గతంలో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో.. హైకోర్టు అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తరలించరాదని హెచ్చరించింది. అయినా సరే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పరిపాలన సౌలభ్యం పేరుతో ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మూడు రాజధానుల విషయంలో దూకుడుగా ఉన్న ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం అందరిని షాక్ కి గురి చేస్తుంది.
అయితే... ఈ మూడు రాజధానుల విషయ మై ఇటీవల కాలంలో కూడా రాజధాని అమరావతి ప్రజలు నిరసనలు వ్యక్తం చేసి, నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి అమరావతి ప్రజలు ఏం చేస్తారో..అన్న విషయమై వేచి చూడాల్సిందే...