కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు.  కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రావాల్సిన నిధుల్లో  కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని మండి పడ్డారు. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

 

కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సీనియర్ అధికారులతో దాదాపు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతూ ... కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారు మారు అయింది.

 

 కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూ ఇటు అయిన సందర్భాలున్నాయి కానీ, 2019-20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దారుణంగా పడిందని కేసీఆర్ అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: