కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ సర్కార్‌ పై పొగడ్తల వర్షం కురిపించారు. కాగా., అసలు తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.   ఈ బడ్జెట్‌ లో రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా మొండిచూపించిన విషయం తెలిసిందే... అయితే.. పవన్ మాత్రం కేంద్ర బడ్జెట్ అద్భుతం అంటూ కొనియాడారు. అయితే రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణమని పవన్ వ్యాఖ్యానించారు. 


పవన్ మాట్లాడుతూ.. ఇంతటి అద్భుతమైన బడ్జెట్ రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కు జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అంటూ.. ధన్యవాదాలు తెలపటం గమనార్హం.  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న వేళ ఇండియాపైన దాని ప్రభావం ఉన్నప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప ఆకాంక్షలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చాలా బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేదిగా బడ్జెట్ ఉందన్నారు. ముఖ్యంగా రైతాంగానికి రూ.15 లక్షల కోట్ల రుణం కల్పించాలన్న ఆశయం, రూ. 2.83 లక్షల కోట్ల నిధుల కేటాయింపు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.

 

అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పవన్ వ్యాఖ్యానించారు. కూల్చివేతలు, రద్దులు, రాజధాని తరలింపులు, ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడంపై పెట్టిన ఫోకస్.. బడ్జెట్‌ పై పెట్టుంటే కేంద్రం నుంచి కచ్చితంగా గొప్ప నిధులు వచ్చేవన్నారు. కానీ ఇది పూర్తిగా వైసీపీ వైఫల్యమేనని తెలిపారు. కనీసం ఇప్పటికైనా వాళ్లు కళ్లు తెరుచుకోవాలని హితవుపలికారు.


అలాగే ఆదాయపన్నుకు సంబంధించి ఏడు శ్లాబుల పాలసీ విధానం ఆయా ఆదాయ వర్గాలకు చాలా ఊరట కలిగిస్తుందని, ఈ విషయంలో ప్రధాని మోదీకి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ మొత్తంగా ప్రధాని నరేంద్ర ఆకాంక్షిస్తోన్న నవ భారతానికి బలమైన పునాదులు వేసేదిగా ఉందన్నారు. అలాంటి బడ్జెట్ ఇచ్చినందుకు, దేశాన్ని పురోగతిలో నడిపిస్తున్నందుకు ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: