ఇటీవల జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సంగతి విదితమే. కాగా., ఆయన రాజీనామా చేసిన అనంతరం మొదటి సారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జనసేనలో నా అధ్యాయం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. జనసేనతో తన ప్రయాణం, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. నా రాజీనామాకు గల కారణాలను రాజీనామా లేఖలోనే తెలిపానని ఆయన చెప్పారు. నా రాజీనామా ఆమోదం పొందిందన్నారు.
ఆదివారం విశాఖపట్నంలో పర్యటించిన జేడీ లక్ష్మీనారాయణ అక్కడ మీడియాతో మాట్లాడారు. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ను సోమవారం ప్రారంభిస్తున్నట్లు జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. జనసేనతో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాని చెప్పారు. ప్రజలు, రైతు సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజా సేవకు అత్యుత్తమ వేదిక రాజకీయమేనని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్ లో చర్యలు తీసుకున్నట్లు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. సప్లిమెంటరీ బడ్జెట్ లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మరిన్ని నిధులు రాబట్టేందుకు ఎంపీలు ప్రయత్నించాలని సూచించారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలపై చాలా బాధ్యత ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జేడీ ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయం, మేకిన్ ఇండియా, విద్య సహా పలు రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు బాగున్నాయని చెప్పారు. దేశ అంతర్గత భద్రత, ఆర్థిక పరిస్థితి పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రజాహితంగా ఉందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయని తెలిపారు.