అంబేద్కర్ మహాశయుడు దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీఎంపీ తనస్వార్థానికి ఉపయోగించారని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. దిశచట్టం వచ్చాకే ఆడబిడ్డలు, బాలికలపై రాష్ట్రంలో అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. చంద్రబాబు, లోకేశ్లు చెప్పారనే టీడీపీనేతలు, కార్యకర్తలు మౌనంగా ఉంటున్నారు. విశాఖలో భూములమ్ముకోవడానికే వైసీపీ స్వార్థ, సంకుచిత రాజకీయాలు చేస్తోంది. దళితముద్రతో ఎంపీగా గెలిచిన నందిగం సురేశ్ తనస్వార్థం కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని, దళితుల ఆత్మన్యూనతభావాన్ని పోగొట్టేందుకు, వారిని ఎవరైనా కులం పేరుతో కించపరిస్తే అటువంటి వారిపై మాత్రమే ఆ చట్టాన్ని మోపాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ ఆలోచనల్ని సురేశ్లాంటివారు తమ స్వార్థానికి వినియోగించడం బాధాకరమని టీడీపీ మహిళానేత, మాజీఎమ్మెల్యే, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
సోమవారం ఆమె మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్లు తమపై దాడిచేయించారంటున్న సురేశ్, టీడీపీకార్యకర్తలు నిజంగా దాడిచేయాలనుకుంటే, వారికి ఒకరు చెప్పాల్సిన పనిలేదని, వారెప్పుడూ న్యాయ బద్ధంగా ధర్మంవైపే నిలుస్తారని విషయాన్ని ఎంపీ తెలుసుకోవాలన్నారు. వైసీపీప్రభుత్వం చేస్తున్న పన్నాగాలు, కుట్రలపై ప్రజలంతా ఇప్పటికే కోపంతో ఉన్నారన్నారు.
పువ్వులిచ్చి జై అమరావతి అనాలని కోరడం తప్పెలా అవుతుందో, తనపై దాడిచేశారంటున్న సురేశ్, దాడి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్న సాక్షి మీడియా స్పష్టంచేయాలన్నారు. సురేశ్ తనపై తానే దాడిజరిగినట్లు సృష్టించి, పువ్వులివ్వడాన్ని కూడా తప్పుపట్టే స్థితికి దిగజారాడన్నారు. లోకేశ్, చంద్రబాబు చెప్పారనే టీడీపీనేతలు, కార్యకర్తలు మౌనంగా ఉంటున్నారనే విషయాన్ని సురేశ్ గ్రహించాలన్నారు. గతంలో సురేశ్ అమరావతి రైతులు, భూములు విషయంలో రాద్ధాంతం చేశాడని, అయినా ఆప్రాంత ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారని, ఇప్పటికైనా ఎంపీ రైతుల మనస్సులు తెలుసుకుంటే మంచిదన్నారు.
నందిగం సురేశ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మానుకొని, ఇప్పటికైనా తనుపెట్టిన తప్పుడుకేసుల్ని ఉపసంహరించుకోవాలని అనిత హితవుపలికారు తప్పుడు కమిటీల రిపోర్టుల్ని దాచిపెట్టి, విశాఖలోని భూములధరలు పెంచుకోవడం కోసం స్వార్థ, సంకుచిత రాజకీయాలు చేస్తున్నవైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని అనిత హెచ్చరించారు। టీడీపీనేతలుగా మేము ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని సక్రమంగానే వినియోగించామని, వైసీపీవారిలా ప్రతిదానికీ ఆచట్టాన్ని దుర్వినియోగం చేయడంలేదన్నారు। రాష్ట్రంలో దిశాచట్టం అమల్లోఉందో లేదోనన్న సందేహం కలుగుతోందని, ఆచట్టం వచ్చాకే ఆడబిడ్డలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు।