అమరావతిలోనే లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ కొనసాగుతుందన్న సీఎం వై ఎస్ జగన్. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు తండ్రిలా ఆలోచన చేయాల్సి ఉంటుందన్నారు. అమరావతి అన్నది ఇటు విజయవాడా కాదు, అటు గుంటూరు కాదు. అమరావతి ప్రాంతంలో సరైన రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, పైపులైన్లు లేవు. కనీస మౌలిక సదుపాయాలకోసం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. దీనికోసం లక్ష కోట్లపైనే ఖర్చు చేయాలని గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లే లెక్కకట్టారు. మొత్తంగా గత అయిదేళ్లలో అమరావతి మీద ఖర్చుచేసింది  5,674కోట్లు మాత్రమే. బకాయిలుగా చెల్లించాల్సినది ఇంకా రూ. 2,297 కోట్ల మేర ఉన్నాయి. 

లక్ష కోట్లు అవసరమైన చోట రూ. 6వేల కోట్లుపెడితే సముద్రంలో నీటి బొట్టే. ఐదేళ్ల తర్వాత మళ్లీ మన పరిస్థితి ఏంటి? . ఉద్యోగాల కోసం మన పిల్లలు మళ్లీ ఎక్కడకు పోవాలి?. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు పోవాలి: అదే ఖర్చులో 10శాతం విశాఖపట్నం మీద పెడితే బాగా డెవలప్‌ అవుతుంది. ఇప్పటికే విశాఖపట్నం రాష్ట్రంలో నంబర్‌వన్‌ నగరం. కనీసం వచ్చే కాలంలో అయినా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇదే తాడేపల్లి, మంగళగిరిని మోడల్‌ మున్సిపాల్టీలుగా చేయడానికి రూ.1100 కోట్లు ఖర్చు అవుతుంది.

ఇలాంటి వాటిని వదిలిపెట్టి, ఎంతపెట్టినా కనిపించని చోట రూ. 1లక్ష కోట్లు పెడితే ఏం ఉపయోగం?. అయినా సరే ఎవ్వరికీ అన్యాయం జరక్కుండా ఇక్కడే లెజిస్లేటివ్‌ కేపిటల్‌ కంటిన్యూ చేస్తామని చెప్పాం. కర్నూలులో జ్యుడిషయల్‌ కేపిటల్, విశాఖపట్నంలో కార్యనిర్వాహక కేపిటల్‌ పెడతామన్నాం. ఇవాళ  నా ముందు రాజధాని రైతులు పెట్టిన అంశాలన్నీ కూడా నెరవేర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత.

రోడ్లను డెవలప్‌ చేస్తే... రేపు ధరలు పెరిగాక రైతులే అమ్ముకుంటారు, లేదా వ్యవసాయం చేసుకుంటారు, అది వారిష్టం. రాజధానిలో మీమీ గ్రామాల్లో ఏం కావాలో.. స్పష్టంగా చెప్పండి. కనీసం 2–3 నెలల్లో పనులు ప్రారంభిస్తాం. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీ అభివృద్ధి ప్రణాళికతో పాటు, ఈ గ్రామాల్లో పనులు కూడా ప్రారంభిస్తాం. ప్రతి ఊరికి సంబంధించి కావాల్సిన రెండు మూడు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయండి, ఆ పనులు చేద్దామని సీఎం జగన స్పష్టం చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: