తెలుగు దేశం పార్టికి ఇప్పుడు చాలా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీ హిస్టరీలోనే అంత బ్యాడ్ టైమ్ ఎప్పుడూ ఉండకపోవచ్చు. ఎందుకంటే మొన్నిటి ఎన్నికల్లో వచ్చినన్ని తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదు. మళ్లీ ఇప్పటికే ఇద్దరు జంప్ అయ్యారు. అటు నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండులా పార్టీలో చీలిక వచ్చే అవకాశం కనిపిస్తోందట.
ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. తెలుగు దేశం పార్టీలో త్వరలో చీలిక రాబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ చీలిపోతుందని చంద్రబాబులో భయం పట్టుకుందని, ఆయనలో అసహనం పెరిగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నారన్న ప్రచారాన్ని గడికోట తీవ్రంగా ఖండించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. " ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. తన కుమారుడి ఎమ్మెల్సీ పదవి ఊడబోతుంది. ఎక్కడ పార్టీ నేతలు తిరగబడుతారోనని పసి గట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయాలను దిగజార్చారు. లోకేష్ తిరుగబడుతాడని చంద్రబాబు మెంటల్గా సిద్ధమయ్యారు. ఇంటిపోరు కూడా మొదలైంది. పార్టీ క్యాడర్ నమ్మే స్థితిలో లేదు. ఎల్లో మీడియా కూడా ఎంతకాలం భరించాలనే భావంతో ఉండంతో చంద్రబాబు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు బాధ్యత మరిచి ఇష్టం వచ్చినట్లు సీఎం వైయస్ జగన్ను దూషిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ కేడర్ అంతా కూడా చంద్రబాబు అధ్యాయం ముగిసిందని ఆయన్ను నమ్మే స్థితిలో లేరు. పార్టీలో త్వరలో చీలికలు రాబోతున్నాయన్న సంకేతాలు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ను ఎలాగైతే దించానో..అలాగే నన్ను దించబోతున్నారని చంద్రబాబుకు అర్థమైందని మండిపడ్డారు.