యూపీలో జరిగిన ఓ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా బైక్పై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరపడంతో అంతర్రాష్ట్ర హిందూ మహాసభ నేత రంజిత్ బచ్చన్ (40) కన్నుమూశారు. రంజిత్తోపాటు వాకింగ్కు వచ్చిన సోదరుడు ఆదిత్య శ్రీవాత్సవకు బుల్లెట్ గాయాలయ్యాయి. దుండగులు వారి మొబైల్ ఫోన్లు తీసుకొని పరారయ్యారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నట్టు జాయింట్ పోలీస్ కమిషనర్ నవీన్ అరోరా ఆ రోజు ప్రాథమికంగా అభిప్రాయం తెలిపారు. అయితే, ఈ విషయంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనకు విడాకులు ఇవ్వకుండా కాలాయాపన చేస్తున్నందుకే రంజిత్ను హత్య చేసినట్టు రంజిత్ బచ్చన్ భార్య స్మృతి శ్రీవాస్తవ పోలీసులకు చెప్పారు. రంజిత్ బచ్చన్ను కాల్చి చంపిన కేసులో ఆయన భార్య, ఆమె ప్రియుడితో పాటు మరో ఇద్దరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బచ్చన్ భార్య షాకింగ్ విషయాలు వెల్లడించారు. తాను దీపేందర్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు, అతన్ని వివాహం చేసుకోవడానికి రంజిత్ నుంచి విడాకుల కోసం 2016లో కోర్టును అశ్రయించినట్టు స్మృతి తెలిపారు. అయితే, కోర్టు విచారణకు హాజరుకాకుండా విడాకుల మంజూరును వాయిదా వేస్తున్నందుకే దీపేందర్ మరో ఇద్దరితో కలిసి రంజిత్ను హత్య చేసినట్టు ఆమె వివరించారు. రంజిత్ హత్య కోసం దీపేందర్ అందర్నీ ఒప్పించాడని, ఈ హత్యకు స్మృతి కుట్ర పన్నిందని, వీరికి సంజీత్ గౌతమ్(డ్రైవర్), జితేంద్ర సాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, గోరఖ్పూర్కు చెందిన రంజిత్ బచ్చన్ 2002 నుంచి ఏడేళ్ల పాటు సమాజ్వాదీ పార్టీలో చురుకైన కార్యకర్తగా కొనసాగారు. అనంతరం విశ్వ హిందూ మహాసభ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అంతరాష్ట్ర విశ్వ హిందూ మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. లైంగికదాడికి పాల్పడినట్టు రంజిత్పై ఆయన మరదలు 2017లో ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా భార్యతో దూరంగా ఉంటున్నారు. కాగా,రంజిత్ బచ్చన్ దారుణ హత్య అనంతరం సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ...ఈ హత్యకు నైతికబాధ్యత వహిస్తూ సీఎం పదవికి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.