హస్తినలో మాటల యుద్ధం ముగిసింది. ఇక భవితవ్యం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది. వాళ్ళ నిర్ణయం ఎలాఉన్నా సరే ఉభయ పక్షాలు శిరసా వహించాల్సిందే. ఏది ఏమైనప్పటికి దేశ రాజధానిలో ఈ సారి ఆసక్తి కరమైన రాజకీయ క్రీడ జరిగింది. దానికి శుక్రవారం చెక్ పెట్టారు. ఆప్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు వాడీవేడిగా సాగించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఢిల్లీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు శనివారం జరగనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రచారం సందర్భంగా ఆప్‌, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.

మతవిద్వేష, జాతీయ ఉన్మాద అంశాలే ప్రధానంగా బిజెపి నేతలు ప్రచారం చేయగా, ఆప్‌ బిజెపికి కౌంటర్‌ ఇస్తూనే తమ పాలనను చూసి ఓటేయాలని అభ్యర్ధించింది. కాగా, కాంగ్రెస్‌ పార్టీ చాలా వరకూ నూతన అభ్యర్ధులతో బరిలోకి దిగింది. 8వ తేదీన పోలింగ్‌ జరగనుండగా, 11న ఫలితాలు విడుదల కానున్నాయి.  మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 672 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అత్యల్పంగా పటేల్‌ నగర్‌ నుంచి కేవలం నలుగురు పోటీచేస్తున్నారు.

కోటి 47 లక్షల మంది ఓటర్లు అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నారు. 13,750 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి రణబీర్‌ సింగ్‌ తెలిపారు. పోలింగ్‌ సిబ్బంది సకాలంలో కేంద్రాలను చేరుకునేందుకు ఢిల్లీ మెట్రో సర్వీసులు ఉదయం 4 గంటల నుంచే ప్రారంభమౌతా యని అధికారులు పేర్కొన్నారు. 190 కంపెనీల సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సిఎపిఎఫ్‌), 19 వేల మంది హోంగార్డులు, 42 వేల మంది స్థానిక పోలీసులను వినియోగిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్‌ కమిషనర్‌ ప్రవీర్‌ రంజన్‌ పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: