ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. ఈసారి ప్రచార ఆర్భాటం కూడా చాలా ఎక్కువగా ఉండటం, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ ప్రచారం సాగించడంతో.. ఢిల్లీలో మళ్లీ గెలిచేది ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే ఢిల్లీలో జరిగే ఎన్నికల విషయంలో జాతీయ మీడియా కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ఒక రాష్ట్రం మాత్రమే కాదు. దేశానికి రాజధాని కూడా. దేశంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నాకూడా ఢిల్లీ నుంచి రావాల్సిందే. దీంతో అందరి దృష్టి ఢిల్లీ ఎన్నికలపైనే ఉంది.
ఇక ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకూ నేడు పోలింగ్ జరగబోతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. మొత్తం 668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.47 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు 13,750 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే ఆసక్తికర విషయమేంటంటే.. ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ ఏకంగా 240 మంది ఎంపీలు, 59 మంది కేంద్ర మంత్రులు, 11 రాష్ట్రాల సీఎంలు, వెయ్యి మంది బీజేపీ కార్యకర్తల్ని రంగంలోకి దింపి భారీ ప్రచారం సాగించింది. ఇక 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ కోటాలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మూడుసార్లు ఢిల్లీ ఎన్నికల్లో వరసగా విజయం సాధించింది. అయితే, 2013లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఢిల్లీని సొంతం చేసుకుంది.
హంగ్ ఏర్పడినా, కాంగ్రెస్ పార్టీ ఆప్ కు మద్దతు ఇవ్వడంతో ఆప్ ఆ పీఠాన్ని సొంతం చేసుకుంది. మరియు 2015లో ఇదే ఆప్ 67 అసెంబ్లీ స్థానాలు గెలచి భారీ విజయాన్ని సొంతం చేసుకోగా.. బీజేపీ 3 గెలిచింది. ఈసారి ఆప్ ఎన్ని గెలుస్తుంది? బీజేపీకి ఎన్ని దక్కుతాయి అన్నదానిపై అసక్తి నెలకొంది. మరోవైపు ఆప్ కు మద్దతు ఇవ్వడం కోసమే ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించింది. కానీ, ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎప్పటి నుంచి బీజేపీకి ఢిల్లీ పీఠం కలగా మారింది. ఈసారి ఢిల్లీపై జెండా పాతాలని చూస్తున్నది. అందరు తాము గెలుస్తామని అంటే తాము గెలుస్తామని చెప్తున్నారు. మరి ఈ ఢిల్లీ అసెంబ్లీ వార్లో స్వీట్లు ఎవరికి.. షాకులు ఎవరికి దక్కుతాయో ఫిబ్రవరి 11 చూడాలి.