దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. ఈ రోజు జరిగిన పోలింగ్ సరళి ఆధారంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ముక్తం కంఠంలో ఆమ్ ఆధ్మీ పార్టీదే ఘనవిజయం అంటూ ప్రకటించేశాయి. ప్రీ పోల్ సర్వే తరువాత బీజేపీ పార్టీ కాస్త పుంజుకున్నట్టుగా కనిపించినా అధికారం చేపట్టే స్థాయిలో మాత్రం సత్తా చాటలేకపోయింది. ప్రధాని, అమిత్ షా సహా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏకమైనా ఓటర్ మాత్రం చీపురు వైపే నిలిచాడు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం రెండోసారి కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయటం లాంచనమే అని తెలుస్తోంది. అంకెల్లో కాస్త అటు ఇటూ అయినా అన్ని ఆమ్ ఆధ్మీ పార్టీదే విజయం అంటూ తేల్చేశాయి. ముఖ్యంగా పశ్చిమ ఢిల్లీ, చాంధినీ చౌక్, వాయువ్య ఢిల్లీల్లో ఆమ్ ఆధ్మీ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేజ్రీవాల్ను ఎదుర్కొనే స్థాయిలో బీజేపీలో నాయకుడే లేకపోవటం ఆ పార్టీకి తీవ్రం నష్టం చేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సామ బేధా దాన దండోపాయాలన్ని వినియోగించిన భారతీయ జనతా పార్టీ కనీసం రెండకెల ఎమ్మెల్యే స్థానాలు కూడా సాధించకపోవచ్చంటున్నారు ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఢిల్లీలో దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఆమ్ ఆధ్మీ పార్టీకి మద్ధుతు ఇవ్వటం తరువాత వెనకడుగు వేయటం లాంటి పరిణామాలతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పూర్తిగా ఆమ్ ఆధ్మీ వైపు మళ్లిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2015లో జరిగిన ఎన్నికల్లో ఖాతా తెరవకుండానే చాపచుట్టేసిన కాంగ్రెస్ ఈ సారి మాత్రం రెండు మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సుధీర్ఘకాలంగా ఢిల్లీ సింహానాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు మూడు స్థానాలకు పరిమితం కావటం అంటే అది అవమానమే అని భావించాల్సి ఉంటుంది. ఏది ఏమైన తను చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియజేయటంతో పాటు ప్రతిపక్షాల విమర్శలపై స్పందించే విషయంలో హుందాగా వ్యవహరించిన కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ బాద్షాగా సత్తా చాటాడు.