ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారంతా వరుస రివ్యూలతో బిజీ బిజీగా గడిపాడు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాలనను పరుగులు పెట్టిస్తున్న జగన్, అన్ని డిపార్టెమెంట్ల పనితీరును స్వయం పర్యవేక్షిస్తున్నాడు. రోజు ఒక్కో కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తూ తీసుకోవాల్సిన చర్చలపై సలహాలు, సూచనలు ఇస్తూ అధికారులను దిశా నిర్దేశం చేస్తున్నాడు. ఈ వారం కూడా ఇలాంటి కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపేశాడు జగన్.
క్విడ్ప్రో కేసులో తప్పని సరిగా కోర్టు హాజరు కావాల్సిందే అని సీబీఐ కోర్టు చెప్పినా ఈ వారం జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా జగన్ కోర్టు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరుపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. అంతేకాదు వచ్చే వారం కూడా హాజరు కాలేనంటూ అప్పీల్ చేయగా అందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ప్రయాణ ఖర్చులతో పాటు సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనతో ఏకీభవించిన కోర్టు ఫిబ్రవరి 14న వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది.
ఈ వారం జగన్ తనకు అండగా ఉన్న ఆధ్యాత్మిక గురువు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలుసుకున్నారు. మంత్రివర్గ సహచరులు, ఎమ్మేల్యేలతో పాటు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితో కలిసి శారాధపీఠాన్ని దర్శించుకున్న జగన్న అక్కడ జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠం కొత్తగా ఏర్పాటు చేసిన భవనాలను ఆవిష్కరించారు. స్వరూపానంద స్వామి వారికి ఘనంగా కానుకలు అందచేశారు. మొట్ట మొదటి దిశా పోలీస్ స్టేషన్ను ఈ వారమే ప్రారంభించాడు జగన్.
ఈ వారం జగన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపి గల్లా జయదేవ్ మూడు రాజధానుల విషయంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమే అన్న కేంద్ర సమాధానం ఇవ్వటంతో వైసీపీ వర్గాల్లో మరింత జోష్ కనిపిస్తోంది.