తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్త జ్వాలలు ఒక్కోటిగా భయటపడుతున్నాయి. కేసీఆర్ తిరుగులేని విధంగా పరిపాలన చేస్తున్నా మంత్రి పదవులు లేని వాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువుగా ఉండడంతో పాటు హరీష్ రావు వర్గం ఉన్న నేతలు అందరూ తమ బాధను ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమైనా ఇక ఇప్పుడు బయట పడక తప్పని పరిస్థితి.
ఇప్పటికే మునిసిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రయార్టీ లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అగ్గిమీద గుగ్గిల మవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కీలక నేత అధిష్టానంపై తిరుగు బావుటా ఎగర వేయడంతో పాటు అవరసమైతే కేసీఆర్ కు షాక్ ఇచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు అధికార టీఆర్ఎస్ వర్గాల్లోనే లీకులు వస్తున్నాయి.
ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. కేసీఆర్ సొంత సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి కావడం మరో విశేషం. మంత్రి పదవి విషయంలో కేసీఆర్ తనకు హమీ ఇచ్చి, విస్మరించారన్న అసంతృప్తితో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికలకు ముందు ఒకే రోజు తేడాతో మూడు పార్టీలు మారిన హనుమంతరావుకు కేసీఆర్ మల్కాజ్ గిరి ఎంపీ సీటు ఇవ్వగా ఆయన ఓడిపోయారు.
అప్పటి వరకు టీడీపీలో ఉన్న హనుమంతరావు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకపోవడంతో వెంటనే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. తిరిగి హైదరాబాద్ వచ్చి ఆ మరుసటి రోజు టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. ఇక 2018లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా గెలిచిన హనుమంతరావుకు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారని ఆయన భావించారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా సీఎం కేసీఆర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అవకాశం ఇవ్వటంతో మైనంపల్లి అవమాన భారంతో ఉన్నారని పార్టీ వర్గాల టాక్.
తాజాగా సీఎం ప్రతిష్టాత్మకంగా ఓపెనింగ్ చేసిన మెట్రో రెండో దశ కారిడార్ ఓపెనింగ్లో… హైదరాబాద్ ఎమ్మెల్యేలు, చోటా మోటా లీడర్లంతా నానా హాడావిడి చేశారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ గెలుపుతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు గ్రేటర్ పార్టీ బాధ్యతలు ఆయనే చూశారని... ఇక ఇప్పుడు ఆయన పార్టీ అధిష్టానంతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. మరి హనుమంతరావు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ? ఆయన నిజంగా పార్టీ వీడితే అది పార్టీకి పెద్ద షాకే అనాలి.