హైదరాబాద్ నగరంలో ప్రయాణాన్ని సులభతరం, సౌకర్యవంతం చేసేందుకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరంలో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, నాగోల్ నుంచి రాయదుర్గం(హైటెక్ సిటీ)వరకు రెండు మెట్రో క్యారిడార్లను ప్రారంభమైన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి జూబ్లీ బస్స్టేషన్ వరకు మెట్రో రైలు క్యారిడార్-2 రైలు మార్గం ప్రారంభమవడంతో మెట్రో సేవలపై ప్రజల ఆసక్తి మరింత పెరిగింది. అయితే, కీలకమైన మెట్రో చార్జీల విషయంలో కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అదే చార్జీల తగ్గింపు.
కొత్త సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో...తెలుగుదేశం పార్టీ ఆసక్తికర ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది. తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంధ్రశేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...హైదరాబాద్ మెట్రో చార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న మెట్రోరైలు చార్జీల కంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎల్అండ్టీ సంస్థతో జరిగిన ఒప్పందాల్లో భాగంగా గరిష్ట మెట్రో చార్జీలు 19గా ఉందన్నారు. అయితే ప్రస్తుతం మెట్రోచార్జీ రూ.60 ఉందన్నారు. ఖచ్చితంగా మెట్రో చార్జీ 40కి దాటకూడదని ఫెయిర్ నోటిఫికేషన్లో ఉందని పేర్కొన్న ఆయన...అయినప్పటికీ ఎడాపెడా మెట్రో చార్జీలు వసూళ్లు చేయడం నిబంధనలకు విరుద్దమన్నారు. అన్లిమిటీడ్గా తిరిగినా రూ.40కి మించకూడదని తెలిపారు. బెంగళూరు, ఢిల్లీ మెట్రో చార్జీలను పోలిస్తే హైదరాబాద్ మెట్రో చార్జీలు ఎక్కవన్నారు. బెంగళూరులో 6కిమీలకు మెట్రో చార్జీ రూ.18 ఉంటే, హైదరాబాద్లో రూ.25 ఉందన్నారు. హైదరాబాద్లో మెట్రో చార్జీలకు పొంతన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేక్హోల్డర్స్ను ఎవరినీ సంప్రదించకుండా కొత్త చార్జీలను ఎల్ అండ్ టీ ఇచ్చిన ప్రెస్ రిలీజ్కు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించడం ఏమిటని ప్రశ్నించిన రావుల...చార్జీలను తగ్గించాలని కోరారు. కాగా....టీడీపీ డిమాండ్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ధరలు తగ్గించవచ్చని సామాన్యుడి ఆశ.