పాపం.. ఏదైనా సరే మనకు ఇష్టం లేకుండా జరుగుతుంటే ఎవరికైనా చిరాకు పుట్టుకురావడం సహజం. అందులోనూ ఏదో ఒక రోజో రెండు రోజులో అంటే ఓకే. కానీ.. ఏకంగా సంవత్సరాల తరబడి ఇష్టం లేనిది భరించాలంటే ఎవరికైనా కష్టమే.. ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ పరిస్థితి అలాగే ఉంది. జగన్ సీఎం కావడం ఏమాత్రం ఇష్టం లేని ఆయన.. ఇంకెన్నాళ్లు ఈ పాలన భరించాలో అర్థంకాక చిరాకు పడుతున్నారు.

 

 

పాపం.. ఆయనకు ఈ ఏపీ రాజకీయాలు అస్సలు అర్థమై చావడం లేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రాసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అవినీతి కేసుల భయం పట్టుకోగా, తనను కేసుల్లో ఇరికిస్తారేమోనన్న భయంతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు భారతీయ జనతా పార్టీని పల్లెత్తు మాట అనలేకపోతున్నారట. ఇది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం!.. అంటూ తెగబాధపడిపోయారు ఏబీఎన్ రాధాకృష్ణ.

 

 

రెండు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ఎదగాలనుకుంటున్న బీజేపీ కూడా ఆ దిశగా అడుగులు వేయడం లేదట. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లి బీజేపీతో ఎందుకు చేతులు కలిపారో అంతకంటే అర్థం కావడం లేదట. రాజధాని కోసం పోరాటం చేస్తామంటూ ప్రకటనలు చేసి సరిపెట్టుకుంటున్నారట.

 

 

మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, రాజకీయాలు అంతుపట్టని రీతిలో ఉంటున్నాయని రాధాకృష్ణ జుట్టు పీక్కుంటున్నారు. అందుకే తెలంగాణ సోదరుడు ఒకరు.. ఆంధ్రా ప్రజలను తిట్టిన తిట్టు తిట్టకుండా తన ఆవేదనను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వదిలారట. పాపం.. రాష్ట్రం పట్ల తెలంగాణ వారికి ఉన్న ఆవేదన కూడా ఆంధ్రా ప్రజలకు లేకుండా పోయిందని ఒకటే శోకాలు పెడుతున్నారు రాధాకృష్ణ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: