ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు విషయంలో తెలుగుదేశంపార్టీ రివర్స్ గేరు వేసింది. టిడిపి అధికారంలో ఉన్నంత కాలం ప్రతి అడ్డమైన పనికి బాగా ఉపయోగించుకున్న నేతలు ఇపుడు రివర్సు లో మాట్లాడుతుంటంతో ఏబికి షాక్ కొట్టినట్లే అవుతోంది. నిజానికి తానొక అఖిల భారతీయ సర్వీసు (ఐపిఎస్) అధికారిని అన్న విషయం మరచిపోయారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వానికి మాత్రమే తాను జవాబుదారి అన్న విషయాన్ని వెంకటేశ్వర రావు మరచిపోయారు.
చాలామంది టిడిపి నేతలకన్నా చంద్రబాబునాయుడకు విశ్వాసపాత్రునిగా మారిపోయిన ఏబిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. తాజాగా సస్పెండ్ కూడా చేసింది. ఏబి ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో వెంటనే విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని రెచ్చిపోయారు. ఏబి వల్లే తమ పార్టీ ఓడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి కారకుడైన ఏబిని జగన్ ప్రభుత్వం సన్మానం చేస్తుందని అనుకుంటే సస్పెండ్ చేయటమేంటి ? అంటూ ఎకసెక్కాలు మొదలుపెట్టారు.
మీరు @ysjagan ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ @YSRCParty అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ @JaiTDP ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!! pic.twitter.com/mydh04pkVA
— kesineni nani (@kesineni_nani) February 9, 2020
జగన్ అధికారంలోకి రావటానికి ప్రధాన కారణమే ఏబి అంటూ కేశినేని దెప్పి పొడవటం టిడిపిలో సంచలనంగా మారింది. చాలామంది టిడిపి నేతల్లో ఇదే అభిప్రాయం ఉన్నా వాళ్ళెవరూ కేశినేని లాగ బయటపడలేదు. ప్రైవేటు సంభాషణల్లో మాత్రం ఏబిపై మండిపోతున్నది వాస్తవం. చాలామందికి ఏబి పార్టీ పదవులు కూడా ఇప్పించారు. ఆ విషయాన్ని బుద్ధా వెంకన్న లాంటి నేతలు స్వయంగా పార్టీ వేదికల మీదే ప్రకటించారంటే ఏబి ఏ స్ధాయిలో బరి తెగించారో అర్ధమైపోతోంది.
ఒకవైపు ఏబిని సస్పెండ్ చేయటాన్ని చంద్రబాబు, యనమల లాంటి నేతలు తప్పు పడుతుంటే అదే సమయంలో కేశినేని లాంటి చాలామంది నేతలు మండిపోతున్నారు. తమకు పదవులు రాకుండా ఏబినే అప్పట్లో అడ్డు పడ్డారంటూ చెబుతున్నారు. కావాలనే తమపై చంద్రబాబుకు తప్పుడు నివేదికలు ఇచ్చి బద్నాం చేశాడంటూ మండిపోతున్నారు. తన సస్పెన్షన్ పై టిడిపి నేతలు రివర్స్ గేరు వేస్తారని పాపం ఏబి ఊహించినట్లు లేరు.