టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో...ఆయన తనయుడైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలు, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు కీలక పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తన 66 వ సంవత్సరంలో కి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారంలో భాగంగా ఒక్కో మొక్క నాటాలని ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రీన్ కవర్ ని పెంచేందుకు పెద్దయెత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి మొక్కల పెంపకం పట్ల ఇష్టాన్ని చాటుకున్నారని పరిశ్రమలు, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటి ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ మేరకు తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా ఈ మేరకు కేటీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఈనెల 17వ తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన సంబరాలు నిర్వహించాలని సూచించారు.
ఇదిలాఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క హరితహారం స్ఫూర్తితో ఆయన సమీప బంధువు టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. తన పుట్టినరోజు డిసెంబర్ 7 సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణం పచ్చగా ఉంటే.. మనషులంతా చల్లగా ఉంటారనే సీఎం కేసీఆర్ మాటలతో స్ఫూర్తి పొంది.. 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం ప్రారంభించారు. ఇందులో భాగంగా తన పుట్టినరోజు 2019 డిసెంబర్7 కీలక పాత్ర పోషిస్తారు. ``నా మిత్రులను మరియు శ్రేయోభిలాషులందరినీ భాగస్వామ్యులను చేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు తన పుట్టిన రోజు సందర్భంగా మీరందరూ ఒక మొక్కను నాటుతూ దిగిన సెల్ఫీని తనకు బహుమతిగా పంపించాలి` అని విజ్ఞప్తి చేశారు. `మీరు మొక్క నాటుతూ దిగిన సెల్ఫీలతో తన ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ నిండిపోయేలా చేస్తారని ఆశిస్తున్నాను` అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా ఇదే తరహాలో కేసీఆర్ పుట్టినరోజును సైతం మొక్కలు నాటేలా పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది.