తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావును ప్రభుత్వం రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విచిత్రమేమిటంటే ఆ సస్పెన్షన్ పై టిడిపి నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో నేతల మధ్య ఏబి కేంద్రంగా మాటల యుద్ధం మొదలైపోయింది.
సరే నేతలు ఏ విధంగా మాట్లాడినా చంద్రబాబునాయుడు పక్కనే ఉంటూ ఏబి పార్టీ విజయావకాశాలను దారుణంగా దెబ్బ కొట్టారన్న విషయం బయటపడిపోయింది. టిడిపి నేతల మాటల్లో బయటపడిన ఈ విషయంతో డ్యామేజి జరగకుండా చంద్రబాబు అందరిపైనా మండిపడటం గమనార్హం. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోవటానికి ప్రధాన కారణం ఏబినే అన్న విషయం విజయవాడ ఎంపి కేశినేని నాని ట్వీట్ తో బయటపడింది.
పార్టీలోని నేతల్లో చాలామంది ఏబి అంటే మండిపోతున్నారు. ఎందుకంటే చాలామంది నేతలపై ఏబి ఇంటెలిజెన్స్ నివేదికల పేరుతో చంద్రబాబు దగ్గర బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేశారట. దాంతో ఒకళ్ళకు రావాల్సిన టిక్కెట్ మరొకరికి దక్కటం, టికెట్ కోసం పరిశీలనలో ఉన్న వాళ్ళ పేర్లు చివరికి గల్లంతైపోవటం లాంటివి చాలా నియోజకవర్గాల్లో జరిగాయని ఆరోపణలున్నాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాలపైన ఎక్కించుకుని మోయటమే పార్టీ విధానం అయితే నేను ఖచ్చితంగా ఆ విధానానికి వ్యతిరేకమే pic.twitter.com/hMHgyzYuho
— kesineni nani (@kesineni_nani) February 11, 2020
నేతలు నేరుగా చంద్రబాబును కలుసుకుని తమకు టిక్కెట్లిస్తే గెలుపు అవకాశాలున్నాయని ఎంత చెప్పుకున్నా చివరకు ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఏబి సలహా ప్రకారమే నడుచుకున్నారట. మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున టిక్కెట్లు తెచ్చుకున్న అభ్యర్ధులను చూసి చాలామంది నేతలు ఆశ్చర్యపోయారని సమాచారం. గెలుపవకాశాలు ఏమాత్రం లేని వాళ్ళు, అత్యంత అవినీతిపరులుగా ముద్రపడిన వారికి టిక్కెట్లిచ్చేది లేదని చంద్రబాబే స్వయంగా ప్రకటించారు.
అయితే చివరకు అలాంటి వాళ్ళకే టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇటువంటి వాళ్ళకు టిక్కెట్లు రావటంలో ఏబి పాత్ర చాలా ఎక్కువగా ఉందనే ఆరోపణలున్నాయి. ఏబి సస్పెండ్ అయిన తర్వాత ఇటువంటి విషయాలపై పార్టీలో బాగా చర్చ జరుగుతోంది. మొత్తానికి అందరూ అనుకునేదేమంటే చంద్రబాబు పక్కనే ఉంటూ ఏబి పార్టీ విజయాలపై అంత దెబ్బ కొట్టారా ? అని.