ఆంధ్రప్రదేశ్లో కేబినేట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మార్చి 15 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. డబ్బు మద్యానికి తావులేకుండా ఉండేలా ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది.ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే గతంలో గరిష్టంగా మూడు మాసాల శిక్ష మాత్రమే పడేది.
అయితే ఇప్పుడు నిబంధలను సవరించి కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎస్టీలకే దక్కేలా చర్చలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో డబ్బు పంచుతూ అభ్యర్థి దొరికితే అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భవిష్యత్తులో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే నిర్ణయాలను అమలు చేయనున్నారు.
విద్యార్ధులకు ఇప్పటికే ఉచిత్ర మధ్యాహ్నం భోజనంతో పాటు విద్యార్థుల తల్లికి అమ్మ ఒడి పథకం కింద 15000 ఏడాదికి అందిస్తున్న ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, షూస్, అన్ని కలిపి ఓ కిట్ రూపంలో ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వటం లాంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరువాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ను ఏర్పాటు చేసి, దాని ద్వారా ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న మిగులు నిధుల నుంచి ఇంట్రస్ట్ పొందేందుకు ఏర్పాట్లు అనుమతి ఇచ్చినట్టుగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక మీదట వ్యవసాయరంగంలో ఉన్న సమస్యలతో పాటు రైతులకు సలహాలు సూచలను ఇచ్చేందుకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించినట్టుగా పేర్ని నాని వెల్లడించారు. కేబినేట్ సమావేశం పూర్తయిన వెంటనే జగన్ ఢిల్లీ బయలుదేరారు. ఈ రోజు అమిత్ షాతో రేపు ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారు.